– 24 డిమాండ్లపై యాజమాన్యంతో అంగీకారం
– అమలు జరిగే వరకు నిరంతర పర్యవేక్షణ : జక్కుల గట్టయ్య
రుద్రంపూర్, సెప్టెంబర్ 03 : సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ చేపట్టిన నిరంతర పోరాటాల ఫలితంగానే యాజమాన్యంతో 24 డిమాండ్లపై చారిత్రాత్మక ఒప్పందాలు కుదిరాయని ఏఐటీయూసీ కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ కార్యదర్శి జక్కుల గట్టయ్య అన్నారు. కొత్తగూడెం ఏరియా వర్క్షాప్, ఆర్సీహెచ్పీ వద్ద గురువారం నిర్వహించిన గేట్ మీటింగ్లో ఆయనతో పాటు ఏఐటీయూసీ సెంట్రల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరస్వామి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. జూన్ 8న 31 డిమాండ్లతో సమ్మె నోటీస్ ఇవ్వడంతో యాజమాన్యం దిగివచ్చి ఆర్ఎల్సీ సమక్షంలో ఒప్పందాలు చేసుకుందని తెలిపారు. ఒప్పందాల్లో భాగంగా కార్మికుల పేరోల్పై ఆదాయ పన్నును యాజమాన్యమే చెల్లించడం, దసరాకు ముందే లాభాల వాటా చెల్లించడం, సహజ మరణం పొందిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియాను రూ.20 లక్షలకు పెంచడం, 149 మంది డిపెండెంట్లకు ఈ నెలాఖరులోగా ఉద్యోగ నియామకాలు చేపట్టడం వంటి కీలక అంశాలపై అంగీకారం కుదిరిందన్నారు.
అలాగే 2017 జేఎంఈటీలకు నోషనల్ ఓవర్మెన్ ప్రమోషన్లు, వివిధ కేటగిరీలకు ప్రమోషన్ క్యాడర్ స్కీమ్, ఖాళీ పోస్టులను అంతర్గత ఉద్యోగులతో భర్తీ చేయడం, ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహణ, హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు, మెడికల్ అన్ఫిట్ ఉద్యోగులకు సూటబుల్ జాబ్లు, బదిలీల కాలపరిమితి తగ్గింపు, మందమర్రి–క్యాసనపల్లి మున్సిపల్ పరిధిలో 9 శాతం హెచ్ఆర్ఏ తదితర అంశాలపై అంగీకారం సాధించామని పేర్కొన్నారు. కార్మికులకు ఇచ్చిన హామీలు, కుదిరిన ఒప్పందాలు పూర్తిస్థాయిలో అమలయ్యే వరకు ఏఐటీయూసీ నిరంతరం పర్యవేక్షిస్తుందని గట్టయ్య స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ కత్తెర్ల రాములు, నాయకులు హుమాయూన్, గుమ్మడి వీరయ్య, సందెబోయిన శ్రీనివాస్, ఏరియా వర్క్షాప్ పిట్ కార్యదర్శి మధుకృష్ణ, ఆర్సీహెచ్పీ పిట్ కార్యదర్శి సురేందర్, పిట్ కమిటీ సభ్యులు గుమ్మడి మురళి, కరుణాకర్, రాజకుమారస్వామి, గోపీనాథ్, సకినాల భాస్కర్, కస్తూరి రమేష్, సత్యనారాయణ, శేఖర్, అతహార్ పాషా, కిరణ్కుమార్, కల్యాణ్, హరీష్, పీఆర్సీ రెడ్డి, శ్రీహరి, తుమ్మల శ్రీనివాస్, నరేష్, ప్రభాకర్, పరశురాములు, అనూష, వెంకటదుర్గ, వసంతిక, రమణ, సంధ్యారాణి, శ్రీమన్నారాయణ, ఈశ్వర్, మహేష్, వెంకట్, మహేశ్వరరావు, సామ్యూల్, సుధాకర్, జాన్సన్, గౌస్, అజ్గర్, రాజలింగయ్య, ఎనగందుల వెంకటేశ్వర్లు, సంపత్, అల్తాఫ్, మోహన్, చందూలాల్తో పాటు ఆర్సీహెచ్పీకి చెందిన పి. వసంతమూర్తి, వంశీ, ఆర్.మురళి, బి.మురళి, టి.రమేష్, యు.శివదర్శన్, బాల నాగేశ్వరరావు, డీఎల్ఆర్ కార్మికులు పాల్గొన్నారు.

‘ఏఐటీయూసీ పోరాట ఫలితమే చారిత్రాత్మక ఒప్పందాలు’