చండ్రుగొండ, జూలై 7 : అభివృద్ధి, సంక్షేమ పథకాలే రాష్ట్ర ప్రభుత్వానికి శ్రీరామరక్ష అని ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ, అన్నపురెడ్డి పల్లి మండలాల్లో ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ముందుగా చండ్రుగొండలో రూ.2కోట్లు, మద్దుకూరులో రూ.1.5కోట్లతో నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. అనంతరం 10మంది లబ్ధిదారుకులకు దళితబంధు పథకం యూనిట్లు(ట్రాక్టర్లను) అందజేశారు. అన్నపురెడ్డిపల్లి మండలం అబ్బుగూడెం, నామవరం, కొండాయిగూడెంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు ప్రారంభించారు.
రాజాపురం, ఎర్రగుంటలో ఆరోగ్య ఉపకేంద్రాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రైతులకు 24గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు పథకం, దళితబంధు పథకం, కల్యాణలక్ష్మి, పథకాలతో పేదలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో ఖమ్మం డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, ఖమ్మ జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు నల్లమల్ల వెంకటేశ్వరరావు, ఎంపీపీ బానోత్ పార్వతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారా బాబు తదితరులు పాల్గొన్నారు.