పర్ణశాల : మండల పరిధిలోని ముసలిమడుగు గ్రామంలో బుధవారం డోలు వాయిద్యాల నడుమ గిరిజన జాతరను గిరిజనులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ జాతరను పగిడద రాజు జాతరగా పిలుస్తారని, ప్రతి ఏడాది శ్రావణమాసంలో ఐదు రోజుల పాటు ఈ జాతర నిర్వహిస్తామని, తాతల నాటి నుంచి ఎంతోవైభవంగా జాతర నిర్వహిస్తూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటామని ఆలయపూజారి వాగే నరేష్ తెలిపారు. గతంలోకాకుండా ఈ ఏడాది కోవిడ్ నిబంధనల ప్రకారం ఒక్కరోజు మాత్రమే జాతర నిర్వహించడం జరిగిందని ఆయన చెప్పారు.
జాతరలో భాగంగా ఉదయం నుంచి గిరిజనులు తలంటు స్నానాలు ఆచరించి గ్రామంలోని ఒక బాలుడిని దేవరబాలగా అలంకరించి గద్దెపై కూర్చుండబెడతారు. అనంతరం దేవరబాలను గిరిజన సాంప్రదాయ నృత్యాలతో ఊరేగిస్తూ సీతానగరం వద్ద పెద్దవాగులో స్నానం చేయించి తిరిగి గద్దె దగ్గరకు తీసుకువెళ్లి మొక్కులను చెల్లించుకుంటారు. ఈ జాతరలో భాగంగా సారలమ్మ జాతర, కొత్తలపండుగ నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ జాతరలో గిరిజనులు వనదేవతను పూజిస్తూ వర్షాలు బాగా పడాలి..పంటలు బాగా పండాలని దేవరను మొక్కుతూ వారి సాంప్రదాయ మొక్కులను చెల్లించుకుంటారు.