రామవరం, జూలై 17 : మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలో గల మైనారిటీ స్టడీ సర్కిల్ నిరుద్యోగ మైనారిటీ యువతకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్, ఇన్సూరెన్స్ రంగాల్లో అందిస్తున్న ఉచిత శిక్షణ, ఉపాధి పథకానికి అర్హులైన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండి.యాకూబ్ పాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ లేదా పీజీలో 50 శాతం మార్కుల అర్హత కలిగి ఉండి, 26 సంవత్సరాల లోపు వయస్సు కలిగి, కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు కలిగి ఉన్నవారు పథకానికి అర్హులని వెల్లడించారు.
ఆసక్తి గల ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు, జైన్, పార్శీలు, బౌద్ద అభ్యర్థులు ఆగస్ట్ 18వ తేదీ లోపు తమ దరఖాస్తులను హైదరాబాద్ మైనారిటీ సర్కిల్ కార్యాలయంలో లేదా జిల్లాలలో గల మైనారిటీ సంక్షేమాధికారి కార్యాలయాల్లో అందజేయాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 85208 60785, 040 23236112 లలో సంప్రదించాలన్నారు.