ఆళ్లపల్లి, జూన్ 24 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల పరిధిలోని ప్రధాన సెంటర్ వద్ద గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రహదారి మొత్తం బురదమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం ఉదయం ఓ ఫెర్టిలైజర్ షాపు వద్దకు వెళ్తున్న ఎరువుల లారీ బురదలో ఇరుక్కుపోయింది. దాంతో రవాణా నిలిచిపోయింది. మండల కేంద్రం యూనియన్ బ్యాంకుకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో ప్రజలు వ్యవసాయ రుణాలకు వెళ్లే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కొద్దిపాటి వర్షాలకి రోడ్డంతా బుడదమయం కావడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రతిరోజు పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఆ బురద వల్ల దుర్గంధం వెదజల్లుతోందని ప్రజలు ఇళ్లలోంచి బయటికి రాలేకపోతున్నారు. త్వరగా రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.