– కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండె వీరహనుమంతరావు
చుంచుపల్లి, జూన్ 27 : కొత్తగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో సంఘ చైర్మన్ మండె వీరహనుమంతరావు రైతులకు కీలక సూచనలు చేశారు. సంఘం నుంచి రుణాలు తీసుకుని ఇప్పటికీ వడ్డీ బకాయిలు చెల్లించని రైతులు వెంటనే బకాయిలను చెల్లించాలని ఆయన కోరారు. రుణాలపై నిర్ణీత గడువులోపు వడ్డీ చెల్లించని పక్షంలో అపరాధ వడ్డీ విధించాల్సి వస్తుందని తెలిపారు. అలాగే గడువు దాటిన రుణ ఖాతాలపై సహకార సంఘాల చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 29 నుంచి జూలై 6 వరకు కొత్తగూడెం సహకార సంఘ కార్యాలయంలో సహకార వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వారోత్సవాల్లో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘ ఉపాధ్యక్షుడు కూచిపూడి జగన్నాధరావు, డైరెక్టర్లు వేల్పుల మల్లేష్, తీట్ల విజయకుమారి, పోటు వెంకటేశ్వరరావు, సంఘ కార్యదర్శి నడికట్టు వెంకటరమణరెడ్డి పాల్గొన్నారు.