బూర్గంపహాడ్, ఏప్రిల్ 07 : ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై శ్రద్ధ ఉండాలని, ఆరోగ్యంపై శ్రద్ధ చూపినప్పుడే జీవితం సాఫీగా సాగుతుందని డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన బూర్గంపహాడ్లో ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మోరంపల్లిబంజర్ పీహెచ్సీ సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కేజీబీవీ పాఠశాల ప్రాంగణం నుండి ప్రారంభమై బస్టాండ్ వరకు కొనసాగింది. అనంతరం కేజీబీవీ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బందికి ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ పలు సూచనలు చేశారు. ఆరోగ్య ప్రాముఖ్యత కోసం విద్యార్ధులు తీసుకోవాల్సిన, పాటించాల్సిన అంశాలను వివరించారు.
తొలుత పీహెచ్సీలో రికార్డులు పరిశీలించి ఆశాలు, ఆరోగ్య సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఆశాలు, ఆరోగ్య సిబ్బందికి సమావేశం నిర్వహించి గర్భిణీల నమోదు, అధిక ప్రమాద గర్భధారణల గుర్తింపు, నిర్వహణ ప్రారంభ దశలో ఏఎన్సీ నమోదు మెరుగుదలపై అవగాహన కల్పించారు. రోగుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వారికి అందుతున్న వైద్యంపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ శ్రీధర్, ఎంపీ బంజర్ వైద్యులు నవీన్, డీపీఎంఓ మోహన్, ఎంపీహెచ్ఐఓ రవి, ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు, ఆశాలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.