రుద్రంపూర్, ఫిబ్రవరి 25 : నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన మల్లయ్య జాతర సందర్భంగా చోటుచేసుకున్న విషాద ఘటనపై రుద్రంపూర్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. రజక కుటుంబానికి ఆలయ ప్రవేశాన్ని నిరాకరించడమే కాకుండా, వారిని నిర్బంధించి దాడికి పాల్పడిన ఘటనలో రెండు నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడం అమానవీయమని పలు ప్రజా సంఘాలు ఖండించాయి. ఈ ఘటనకు సంబంధించి శ్రీనివాస్ రెడ్డి, సతీష్ రెడ్డి సహా ఎనిమిది మంది అగ్ర కులాలకు చెందిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కుల వివక్ష భావజాలంతో అమాయక కుటుంబంపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో విశ్వమాత మదర్ థెరిసా సేవా సంస్థ అధ్యక్షుడు గూడెల్లి యాకయ్య మాట్లాడారు. సమాజంలో ఇంకా కొనసాగుతున్న కుల దురహంకారం తీవ్రంగా ఖండించదగినదన్నారు. ఆలయ ప్రవేశం ప్రతి ఒక్కరి హక్కు అని, చట్టాన్ని అతిక్రమించి దాడికి పాల్పడిన వారిపై వెంటనే కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ న్యాయం చేయాలని కోరారు.
రుద్రంపూర్ ఉప సర్పంచ్ తోటరాజు మాట్లాడుతూ.. రెండు నెలల పసికందు మృతి హృదయ విదారకమైన ఘటన అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం, రక్షణ కల్పించాలని కోరారు. ర్యాలీలో పాల్గొన్న ప్రజలు కొవ్వొత్తులు వెలిగించి బాధిత కుటుంబానికి సంఘీభావం తెలిపారు. అనంతరం రెండు నిమిషాల మౌనం పాటించి పసికందు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు ఆరెల్లి శ్రీను, సలిగంటి నవీన్, బొట్ల ప్రసాద్, డి.శ్రీనివాస్, గూడెల్లి ముఖేష్ మహారాజ్, బడే రమేష్, వీరన్న, మొహమ్మద్ రఫీ, ఆర్.ఎం.పీ రాము, కన్ని, సోప్పరి క్రాంతి, కోళ్ల హరీష్, పవన్, కలకోటి ఐలయ్య, కాంతారావు, గోకారపు శ్రీరాములు, మాచర్ల మహేష్, అనిల్, శంకర్, తాపీ సంఘం ఆదాం, యూసుఫ్, కన్నె శంకర్ పాల్గొన్నారు.

‘కుమ్మెర’ ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలి’