రామవరం, జూలై 23 : గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని సత్తుపల్లి ఉపరితల గనులు (ఓపెన్ కాస్ట్) జే వి ఆర్ ఓ సి, కిష్టారం ఓసిలలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. వర్షం నీటితో ఓపెన్ కాస్ట్లు జలాశయాలుగా మారిపోయాయి. మోటార్ల ద్వారా నీటిని తోడుతున్నారు. బొగ్గు రవాణాకు ఆటంకం కలగకుండా యాడ్లలో నిల్వ చేసిన బొగ్గును రవాణా చేస్తున్నారు.
మంగళవారం, బుధవారం కురిసిన వర్షాలకు కిష్టారం ఓసిలో మంగళవారం 5 వేలు, బుధవారం 8 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. జేవిఆర్ఓసిలో మంగళవారం 30 వేల టన్నులు, బుధవారం 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. రెండు రోజుల్లో ఓవర్ బర్డెన్ తొలగింపులో 3,35,000క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులు ఆగిపోయాయి. ఏరియాలో రెండు రోజుల్లో 63 వేల టన్నులు బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. రెండు రోజుల్లో 59 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.