జూలూరుపాడు, ఆగస్టు 28 : అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శిగా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన ఎస్.కె. చాంద్ పాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఏఐవైఎఫ్ జిల్లా మహాసభల్లో ఈ మేరకు నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా శుక్రవారం జూలూరుపాడు మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన యువతకు నిరుద్యోగ భృతి అందించాలని, రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలను అప్పగించిన భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషాతో పాటు జిల్లా నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో యువజన సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పోరాటాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.