బూర్గంపహాడ్, ఏప్రిల్ 18 : 14వ వేతన ఒప్పంద చర్చలను కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీతో జరిపించకపోతే రానున్న రోజుల్లో 4 వేల మంది కార్మికులతో కలిసి విధులు బహిష్కరించి నిరసన తెలుపుతామని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, ఎండీ.యాకూబ్పాషా, బల్లెం నాగయ్య హెచ్చరించారు. 24 రోజులుగా దీక్షలు చేస్తున్నా ఐటీసీ యాజమాన్యం కార్మికుల గోసను పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. శనివారం దీక్షలో సానికొమ్ము రామచంద్రారెడ్డి, ఆకిని సర్వేశ్వరరావు, బల్లెం నాగయ్య, ఆనికి చందర్రావు పాల్గొనగా బీఆర్డీయూ జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము శంకర్రెడ్డి, సారపాక సేవాలాల్ సేన పట్టణ ఉపాధ్యక్షుడు గుగులోత్ శంకర్, బీఎంఎస్ అధ్యక్షుడు అశోక్ రెడ్డి వారికి పూలమాల వేసి సంఘీభావం తెలిపారు. జేఏసీ బాధ్యులు మాట్లాడుతూ లేబర్ కమీషన్ సైతం వారం రోజులు ఐటీసీ యాజమాన్యానికి కార్మిక సమస్యలపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించిందని, ఈలోగా యాజమాన్యం సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెకు సైతం వెనుకాడేది లేదని హెచ్చరించారు. ఈ దీక్షా శిబిరంలో జేఏసీ సభ్యులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.