కొత్తగూడెం అర్బన్, జూన్ 21: టీఎస్ఆర్టీసీ.. కేవలం ప్రయాణికులను ఒకచోట నుంచి మరోచోటకు తీసుకెళ్లడానికే పరిమితం కావడం లేదు. ప్రయాణికులకు కావాల్సిన సామగ్రిని తరలించేందుకూ ముందడుగు వేసింది. కార్గో పార్సిల్ సేవలను ప్రారంభించి విజయవంతంగా నిర్వహిస్తోంది. రెండేళ్ల నుంచి కార్గో పార్సిల్ సేవలతో ప్రయాణికులు, ప్రజల మన్ననలు పొందుతోంది. ఆర్టీసీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్గో పార్సిల్ సేవలు జూన్ 19 నాటికి రెండేళ్లు పూర్తయ్యాయి. కార్గో సేవలను ప్రారంభించిన మొదటి సంవత్సరంతో పోలిస్తే రెండో సంవత్సరం మరింత మెరుగ్గా సర్వీస్ అందించి కస్టమర్ల అభిమానం చూరగొన్నది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మెరుగైన సేవలు అందించేందుకు సంస్థ చర్యలు తీసుకుంటోంది. అనేక రకాలుగా ఆలోచించి మెరుగైన సేవల కోసం ప్రయత్నిస్తున్నారు. గత ఏడాది వివిధ జిల్లాల్లో బుక్ చేసిన పార్సిళ్లను జంట నగరాల్లోని ఎంజీబీఎస్, జేబీఎస్లో మాత్రమే పార్సిల్స్ తీసుకునే అవకాశం మాత్రమే ఉంది. దీంతో కస్టమర్ల ఇబ్బందు దృష్ట్యా హైదరాబాద్ జంట నగరాల్లో 25 కార్గో పాయింట్లను గుర్తించి వాటి ద్వారా పార్సిళ్లు డెలివరీ చేయడానికి చర్యలు చేపట్టింది. అదే విధంగా జంట నగరాల్లో 11 ప్రాంతాలను గుర్తించి హోం డెలివరీలు సైతం చేస్తోంది. ఈ సేవలను జంట నగరాల్లో పూర్తిగా విస్తరించేందుకు తగిన చర్యలు చేపడుతోంది.
శరవేగంగా సరఫరా
టీఎస్ఆర్టీసీ కార్గో పార్సిల్ బుక్ చేసుకున్న 24 గంటల్లోపే హోం డెలివరీలు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. కార్గో పార్సిల్ సర్వీస్తోపాటు మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్లలేని భక్తుల కోరిక మేరకు వారి బంగారం (బెల్లం)ను కార్గో ద్వారా అమ్మవారి చెంతకు తరలించి తిరిగి ప్రసాదాన్ని కస్టమర్లకు అందజేసింది. అదేవిధంగా శ్రీరామనవమి సందర్భంగా నవమికి వెళ్లలేని వారు కార్గోలో బుక్ చేసుకుంటే వారికి తలంబ్రాలు భక్తులకు చేరవేయడం, జగిత్యాల నుంచి సహజసిద్ధంగా పండించిన మామిడిపండ్లను బుక్ చేసుకున్న వారికి మామిడి పండ్లను అందజేయడం వంటి ప్రత్యేక సేవలు కూడా చేపట్టింది. అదే విధంగా బల్క్గా బుక్ చేసుకున్న వారికి కార్గో వాహనాల ద్వారా రవాణా సదుపాయాన్నీ కల్పిస్తున్నారు. రాష్ట్రంలో కార్గో వాహనాల ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం, విజయ ఆయిల్, ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు సరఫరా, టెన్త్, ఇంటర్ తరగతుల ఆన్సర్ షీట్ల రవాణా వంటి బల్క్ బుకింగ్లతోపాటు ప్రైవేట్ పరిశ్రమల నుంచి వస్తువుల రవాణా, హౌస్ షిఫ్టింగ్ లాంటి కార్యక్రమాలనూ చేపడుతోంది. కార్గో సర్వీస్ను తెలంగాణలో ప్రతి ప్రాంతానికీ విస్తరించడంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్య ప్రాంతాలకు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలకూ విస్తరిస్తున్నారు. రాష్ట్రంలో మొదటి పాయింట్ నుంచి చివరి పాయింట్ వరకు కార్గో అందరికీ అందుబాటులో ఉండే విధంగా విస్తరించేందుకు టీఎస్ఆర్టీసీ మరిన్ని చర్యలు చేపడుతోంది.
2. మేడారం జాతర ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన ఆదాయం: రూ.74,000
3. తలంబ్రాల ద్వారా ఆదాయం: రూ.3,84,960
4. మామిడి పండ్ల ద్వారా వచ్చిన ఆదాయం: రూ.1,27,820
5. కార్గో ద్వారా వచ్చిన ఆదాయం: రూ.7,00,000
సేవలు విస్తరిస్తున్నాం..
టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్గో పార్సిల్ సేవలను ప్రారంభించి ఈ నెల 19 నాటికి విజయవంతంగా రెండేళ్లు పూర్తయ్యాయి. ఇన్నేళ్లలో కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా వారు కోరిన సమయాల్లోనే డెలివరీలు అందించాం. మొదటి సంవత్సరం కంటే రెండో సంవత్సరంలో మరింతగా సర్వీసులు పెంచాం. అన్ని జిల్లాలతోపాటు హైదరాబాద్లో కూడా పార్సిల్ సర్వీసులను పెంచాం. రాష్ట్రంలో కార్గో వాహనాల ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం, విజయ ఆయిల్, ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు సరఫరా, టెన్త్, ఇంటర్ తరగతుల ఆన్సర్ షీట్ల రవాణా తదితర బల్క్ బుకింగ్తోపాటు ప్రైవేట్ పరిశ్రమల నుంచి వస్తువుల రవాణా వంటి కార్యక్రమాలను కూడా చేపడుతున్నాం. ఇది అందరి సమష్టి కృషితోనే సాధ్యమైంది.
-శ్రీనివాస్, వరంగల్, ఖమ్మం జిల్లాల కార్గో మేనేజర్