కొత్తగూడెం ఎడ్యుకేషన్, మే 2 : రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాలను బలోపేతం చేయడంతో తెలంగాణ అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నది. అందులో భాగంగా ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో యువత పెద్దఎత్తున దరఖాస్తు చేసుకుంటున్నారు. ఎలాగైనా సర్కార్ కొలువు సాధించాలనే పట్టుదలతో ప్రణాళిక ప్రకారం చదువుతున్నారు. ఈక్రమంలో దళిత యువతకు జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ క్లాసులు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో ఏప్రిల్ 29వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి.
పోలీస్కు 86, గ్రూప్స్కి 62 మంది
జిల్లావ్యాప్తంగా పోలీస్ ఉద్యోగాల కోసం 86మంది, గ్రూప్స్లో ఉద్యోగాల కోసం 62మంది శిక్షణ పొందుతున్నారు. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులను గత నెల 22వ తేదీన అంబేద్కర్ భవన్లో ఎస్సీ వెల్ఫేర్ అధికారి అనసూయ ఆధ్వర్యంలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి ఖమ్మం, నల్లగొండకు శిక్షణ నిమిత్తం పంపారు. గ్రూప్స్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులను 62మందిని ఎంపిక చేసి వారికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇంకా 38 మంది అభ్యర్థులకు అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ అభ్యర్థులు ఈ నెల 3వ తేదీలోగా ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయంలో ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
నిపుణులతో తరగతులు… మెటీరియల్ పంపిణీ
పోటీ పరీక్షల శిక్షణ కోసం ఉమ్మడి జిల్లాల నుంచి మంచి అనుభవం కలిగిన అధ్యాపకులతో ఎస్సీ అభివృద్ధిశాఖ అదికారులు తరగతులు నిర్వహిస్తున్నారు. సుమారు 50రోజుల పాటు జరిగే శిక్షణలో గ్రూప్స్ అభ్యర్థుల కోసం రూ.2 లక్షలు వెచ్చించి అధ్యాపకులను ప్రభుత్వం నియమించింది. క్లాసులతోపాటు అప్డేటెడ్ మెటీరియల్ను ప్రభుత్వమే అందజేస్తున్నది. తొమ్మిది మంది నిపుణులతో జరుగుతున్న శిక్షణ ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ శిక్షణ జరుగుతున్నది. వీటితోపాటు అభ్యర్థులకు మధ్యాహ్న భోజనం, తాగునీరు, స్నాక్స్, టీ కూడా అందిస్తున్నారు.
మంచి బోధన అందుతున్నది
ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రకటించిన వెంటనే కోచింగ్ సెంటర్కు పరుగులు తీయాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆర్థిక స్తోమత లేదు. దూరప్రాంతాలకు వెళ్లాలంటే కుదరదు. ఇంటివద్దే ఉండి చదువుకుందామంటే అస్సలు కుదరదు. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఉన్న నాకు ఉచిత శిక్షణ గురించి తెలిసింది. వెంటనే దరఖాస్తు చేసుకున్నా. ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమైంది… మాకు ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో అలానే బోధిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– విజయ్కుమార్, కొత్తగూడెం
ఆర్థిక భారం తగ్గింది
నేను బీటెక్ పూర్తి చేశాను. పంచాయతీ సెక్రటరీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నాను. కోచింగ్ తీసుకోవాలంటే ఆర్థిక పరిస్థితి సరిపోదు. నన్ను చదివించడమే మా వాళ్లకు కష్టంగా మారింది. ఇక కోచింగ్ అంటే వారు ఇంటి వద్దే ఉండమన్నారు. ప్రభుత్వం ఎస్సీ వెల్ఫేర్ ద్వారా ఉచితంగా కోచింగ్ ఇస్తున్నట్లు తెలుసుకున్నాను. దరఖాస్తు చేసుకున్నాను. ఇక్కడ మంచి బోధన అందుతున్నది. క్లాసులు మంచిగా చెబుతున్నారు. కచ్చితంగా ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం కలిగింది.
– దాసరి నందిని, పాల్వంచ
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. ప్రత్యేకంగా దళిత అభ్యర్థుల కోసం శిక్షణ తరగతులు అందిస్తున్నది. నిరుద్యోగులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సీఎం కేసీఆర్ దళితులకు అన్నిరకాలుగా చేయూత అందిస్తున్నారు. ఉద్యోగాలు సాధించేందుకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పట్టుదలతో ప్రభుత్వ కొలువు సాధించాలి.