మామిళ్లగూడెం, జూన్ 23: ఖమ్మం నగరంలో డ్రగ్స్ రాకెట్ నడుపుతున్న ముఠాను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. జిల్లాఎక్సైజ్శాఖ అధికారి నాగేంద్రరెడ్డి గురువారం జిల్లాఎక్సైజ్శాఖ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. నగరంలోని శ్రీశ్రీ సరిల్లో ఖమ్మం ఎక్సైజ్ అధికారులు, స్టేట్ ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ అధికారులు గురువారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అటుగా వచ్చిన కారును ఆపి తనిఖీ చేశారు. కారులో 10 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, 60 గ్రాముల హాషిష్ ఆయిల్, 1600 గ్రాముల ఎండు గంజాయిని గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న ఖమ్మానికి చెందిన తుమ్మా భానుతేజరెడ్డి, ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడేనికి చెందిన మేడిది రోహిత్రెడ్డి అదుపులోకి తీసుకున్నారు. వీరు ఖమ్మం నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తరలిస్తున్నట్లుగా గుర్తించారు. ప్రధాన నిందితుడు భానుతేజరెడ్డి ఐటీఐ పూర్తి చేసి బెంగళూరులో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ డ్రగ్స్ ముఠాతో సంబంధాలు పెట్టుకున్నాడు. డ్రగ్స్ కేసులో అక్కడి పోలీసులకు చిక్కన భానుతేజరెడ్డి ఆ తర్వాత బయటకు వచ్చాడు.
అక్కడి నుంచి హైదరాబాద్కు మకాం మార్చాడు. హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ దందాను ప్రారంభించాడు. ఇవే రకమైన కేసుల్లో రెండుసార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. తర్వాత మళ్లీ బయటకు వచ్చి ఖమ్మం నగరానికి వచ్చాడు. ఆరు నెలల నుంచి నగరంలో నివాసం ఉంటూ బెంగళూరు, గోవా, ముంబై నుంచి ఎండీఎంఏ మెత్ డ్రగ్, హాసిష్ ఆయిల్, ఆంధ్రప్రదేశ్లోని అరకు ప్రాంతం నుంచి ఎండు గంజాయిని తెప్పిస్తున్నాడు. వాటిని హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రితో పాటు తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడు. ఇతనికి ఇంజినీరింగ్ పూర్తి చేసిన రోహిత్ రెడ్డి అసిస్టెంట్గా వ్యవరిస్తున్నాడు. ఒక గ్రాము ఎండీఎంఏను రూ.2 వేలకు కొనుగోలు చేసి కొనుగోలుదారులకు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు, హాసిష్ ఆయిల్ను కేజీ రూ.50 వేలకు కొనుగోలు చేసి విడిగా ఒక లక్ష వరకు, ఎండు గంజాయిని 100 గ్రాములు వెయ్యి చొప్పున విక్రయిస్తున్నట్లు పోలీసులు విచారణలో తెలుసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు. నిందితుడిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఖమ్మం-1 ఎక్సైజ్ సీఐ కె.రాజు, వి.రవి సిబ్బందిని జిల్లాఎక్సైజ్శాఖ అధికారి అభినందించారు.