మామిళ్లగూడెం, జూన్ 23: జిల్లాలో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా చేపట్టాలని కలెక్టర్ వీ పీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఎంపీడీవోలతో ఉపాధి హామీ పనుల గురించి సమీక్షించి మాట్లాడారు. ఎంపీడీవోలు ఉపాధిహామి పీవోలని వారిపై ఉన్న లక్ష్యం మేరకు పనులు పూర్తి చేసి చెల్లింపులు చేసే బాధ్యత ఉందని తెలిపారు. అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, జడ్పీ సీఈవో అప్పారావు, డీపీవో హరిప్రసాద్, డీఆర్డీఏ ఏపీడీ శిరీష, డీఎల్పీవో పుల్లారావు పాల్గొన్నారు.
ఇంధన కొరత లేకుండా చూడాలి..
జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా చూడాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో ఇంధన సంస్థల ప్రతినిధులు, డీలర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వానకాలం వ్యవసాయ సీజన్ సమయంలో ఇంధన కొరత రానీయొద్దన్నారు. అదనపు కలెక్టర్ మధుసూదన్, డీఎస్వో రాజేందర్ పాల్గొన్నారు.
నిర్వహణ పకడ్బందీగా చేయాలి
బయో మెడికల్ వేస్ట్ నిర్వహణ పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం జరిగిన జిల్లా స్థాయి బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. బయో మెడికల్ వేస్ట్తో ప్రాణులకు, పర్యావరణానికి నష్టం జరుగకుండా చూడాలని ఆదేశించారు. ఏడీసీపీ శబరీష్, డీఎంహెచ్వో డాక్టర్ మాలతి, జిల్లా పశుసంర్థకశాఖ అధికారి వేణుమనోహర్రావు, మున్సిపల్ కమిషనర్లు సుజాత, రమాదేవి, ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ గురునాథరావు తదితరులు పాల్గొన్నారు.
దత్తతలో మార్గదర్శకాలు పాటించాలి..
తల్లిదండ్రులు పోషించలేక జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశు గృహ సంరక్షణలో ఉన్న ఇద్దరు కవల ఆడ పిల్లలను చెన్నైకి చెందిన దంపతులకు కలెక్టర్ వీపీ గౌతమ్ గురువారం దత్తత ఇచ్చారు. సెంట్రల్ అడాప్షన్ రెగ్యులేషన్ అథారిటీ మార్గదర్శకాల ప్రకారం కలెక్టరేట్లో కలెక్టర్ చాంబార్లో వారికి దత్తత ఇచ్చారు. జిల్లా సంక్షేమాధికారి సంధ్యారాణి, డీసీపీవో విష్ణువందన పాల్గొన్నారు.