కొణిజర్ల, జూన్ 23 : జీవవైవిధ్యానికి పెనుశాపమైన బీటీ-3 పత్తి విత్తనాలపై అన్నదాతలు అవగాహన కలిగి ఉండాలని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మానవుని ఆరోగ్యంతో పాటు, భావితరాల భవిష్యత్ను దెబ్బతీసే బీటీ-3 పత్తి విత్తనాలపై సరైన అవగాహన లేకుంటే క్యాన్సర్ బారిన పడాల్సి ఉంటుందనే విషయాలను గమనించాలి. రాష్ట్రంలో ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలో విరివిగా పత్తి పంట పండిస్తున్న నేపథ్యంలో అక్రమార్కులు స్వప్రయోజనంతో బీటీ-3 విత్తనాలు సాగు చేసే విధంగా రైతులను రహస్యంగా ప్రోత్సహిస్తున్నారు. పత్తి పంటలో పచ్చ, లద్దె పురుగుతో పాటు, కలుపు మొక్కలను సైతం తట్టుకుంటుందని, అధిక దిగుబడులు వస్తాయని రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తూ రెట్టింపు ధరలకు విత్తనాలు విక్రయిస్తున్నారు. రైతాంగం వారి ఉచ్చులో పడి ఖర్చులు తగ్గుతాయేమోననే ఆలోచనతో సాగు చేస్తున్నట్లు సమాచారం.
బీటీ అంటే ఏమిటీ :
బీటీ అంటే బ్యాసిల్లా తురంజన్సిస్. ఇది ఒక బ్యాక్టీరియా. చీడపీడలను తట్టుకునే మేలురకమైన వంగడంగా భావిస్తారు. దీనిని 2002లో అమెరికాలోని మోన్శాంటో అనే కంపెనీ మహారాష్ట్రకు చెందిన ఒక విత్తన కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని భారతమార్కెట్లోకి అడుగు పెట్టింది. మొదటగా బీటీ-1ను మార్కెట్లోకి తీసుకురాగా అది పత్తిపైరుపై వచ్చే పచ్చ పురుగును 90 నుంచి 120 రోజుల వరకు ఎదుర్కొంది. అనంతరం మార్కెట్లోకి వచ్చిన బీటీ-2 పచ్చపురుగుతో పాటు, లద్దెపురుగు సైతం ఎదుర్కొనే శక్తితో మార్కెట్లోకి రావడంతో రైతుల దృష్టిని ఆకర్షించింది. విత్తన తయారీ సమయంలోనే పత్తి విత్తనాల్లో బ్యాక్టీరియాను జొప్పించడం ద్వారా రెండు రకాల పురుగులను ఎదుర్కోగలిగాయి. నాడు బీటీ టెక్నాలజీని భారతదేశంలో తీసుకురావడంపై పార్లమెంట్లో ప్రతిపక్ష, విపక్ష పార్టీల మధ్య అంతర్యుద్ధం జరిగింది.
బీటీ-3 వాడితే క్యాన్సర్ తథ్యం :
పత్తి పంటలో బీటీ విత్తనాల హవా కొనసాగుతున్న సమయంలో అదే మోన్శాంటో కంపెనీ బీటీ-3 విత్తనాలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. పచ్చపురుగు, లద్దెపురుగుతో పాటు కలుపుమందు (ైగ్లెపోసెట్) చల్లినా పంటకు ఎటువంటి నష్టం వాటిల్లదని, కూలీల ఖర్చు తగ్గుతుందని, అధిక దిగుబడులు వస్తాయని రైతాంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. బీటీ-3కు రాష్ట్రంలో ఎటువంటి అనుమతులు లేవు. బీటీ-3 పంట సాగు చేస్తే అక్కడ పనిచేసే రైతాంగానికి, రైతు కూలీలకు, పరిసర ప్రాంతాల్లో సంచరించే వారికి క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు చెప్పడంతో తెలంగాణ సర్కారు బీటీ-3 పత్తి విత్తనాలను నిషేధించింది.
రెట్టింపు ధరలకు విత్తన విక్రయాలు :
సాధారణంగా బీటీ-1, బీటీ-2 విత్తనాలు మార్కెట్లో 450 గ్రాముల విత్తన ప్యాకెట్ రూ.750 నుంచి రూ.780 విక్రయిస్తుండగా, బీటీ-3 పేరిట 450 గ్రాముల విత్తన సంచిని ఎటువంటి అనుమతులు, రసీదులు లేకుండా రూ.1200 నుంచి రూ.1300 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. బీటీ-3 సాగు చేసిన రైతాంగం నెల రోజుల తర్వాత కలుపు నివారణకై ైగ్లెపోసేట్ అనే మందును నేరుగా పిచికారీ చేయవచ్చు. నిషేధించబడిన బీటీ విత్తనాలను పొరుగు రాష్ర్టాల నుంచి సరఫరా చేస్తుండగా వ్యవసాయ శాఖ, రెవెన్యూ, టాస్క్ఫోర్సు అధికారులు మండలంలోని పెద్దరాంపురం గ్రామంలో చాకచక్యంగా స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ చుట్టుపక్కల మండలాలు, మారుమూల గ్రామాల్లో బీటీ-3 పత్తి సాగవుతున్నట్లు సమాచారం.
నిషేధిత విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
చట్టవ్యతిరేక జన్యు మార్పిడి కలిగిన బీటీ-3 విత్తనాల పట్ల రైతాంగం అప్రమత్తంగా ఉండాలి. అనుమతి లేని, రసీదు లేని విత్తన కొనుగోళ్లు రైతాంగానికి తీవ్ర నష్టాన్ని మిగులుస్తాయి. ఇటువంటి పంటల సాగు వల్ల రైతు కుటుంబ సభ్యులు, కూలీలకు క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుంది. ఇలాంటి విత్తనాలు సాగు చేసినా తక్షణమే సమాచారం ఇవ్వండి.
– బాలాజీ, మండల వ్యవసాయాధికారి