కొత్తగూడెం అర్బన్, జూన్ 23: ఉపాధి హామీ పథకాన్ని మిగతా రాష్ర్టాల కంటే రాష్ట్ర ప్రభుత్వం చక్కగా అమలు చేస్తున్నది. భద్రాద్రి జిల్లాకు ప్రభుత్వం ఈ ఏడాది 65.92 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. ఏప్రిల్ నుంచి ఈ పని దినాల లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. పని ప్రదేశాల్లో కూలీలు సేదతీరేందుకు టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. మంచినీటి వసతి కల్పిస్తున్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచుతున్నారు. జిల్లావ్యాప్తంగా 2,29,416 జాబ్కార్డులు ఉండగా 5,01,692 మంది కూలీలు తమ పేర్లను జాబ్కార్డుల్లో నమోదు చేసుకున్నారు. గతేడాది ప్రభుత్వం 54,03,224 పని దినాల లక్ష్యాన్ని నిర్దేశించగా ఉపాధి కూలీలందరికీ పని కల్పించి లక్ష్యాన్ని ఛేదించారు. 11,455 మంది కూలీలు వంద రోజుల పని దినాలు పూర్తి చేసుకున్నారు. గ్రామాల్లో ఇంకా చేపట్టాల్సిన పనులను అధికారులు గుర్తిస్తున్నారు. జాబ్కార్డు ఉన్న కూలీలందరూ సకాలంలో వేతనాలు తీసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారు.
ప్రతిరోజూ 70 వేల మంది కూలీలు హాజరు..
వేసవిలో జిల్లావ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు 70 వేల మంది ఉపాధి కూలీలు పనులకు హాజరయ్యారు. జిల్లాలోని 481 పంచాయతీల్లో ఒక పంచాయతీలో సగటున 150 మందికి ఉపాధి దొరుకుతున్నది. వేసవిలో ఎక్కువగా వ్యవసాయానికి సంబంధించిన పనులను చేపట్టారు. రైతులు తమ పొలానికి వెళ్లే దారి, మట్టి పనులు, చెరువు పూడికతీత, కాలువల నిర్మాణం, అంతర్గత రోడ్లు, ట్యాంకు, మినీ ట్యాంకుల నిర్మాణం, నర్సరీల ఏర్పాటు పనుల్లో కూలీలు పాల్గొన్నారు. పనులకు వెళ్లే కూలీల్లో మహిళలే ఎక్కువ. ఈ సంవత్సరం నిర్దేశించిన 65.92 లక్షల పని దినాల్లో ఏప్రిల్, మే, జూన్ 30 వరకు పని దినాల లక్ష్యం 46,06,782 పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 28,74,578 పని దినాలు పూర్తయ్యాయి. లక్ష్యం పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రతిఒక్కరికీ పని కల్పిస్తాం..
ఉపాధి పథకంలో పని అవసరం ఉన్న ప్రతి కూలీకి పని కల్పిస్తాం. జాబ్కార్డులో పేరు ఉన్న ప్రతిఒక్కరూ పనులకు రావొచ్చు. ప్రస్తుతం పనులు చేసేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో కూలీలు భాగస్వాములవుతున్నారు. ప్రతిఒక్కరికీ 100 రోజుల పని కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. – జి.మధుసూదనరాజు, జిల్లా
గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి, కొత్తగూడెం
సౌకర్యాలు బాగున్నాయి..
మేమంతా ఉపాధి పనులకు వెళ్తున్నాం. మా గ్రామం సమీపంలోని కుంటలోనే పనులు చేస్తున్నాం. ప్రతిరోజూ ఉదయాన్నే పనులకు వెళ్తున్నాం. షామియానా కింద సేద తీరుతున్నాం. ఇప్పుడు పొలాలకు వెళ్లే రహదారి పనులు చేస్తున్నాం. వేసవిలో మమ్మల్ని ఉపాధి పథకం ఆదుకున్నది.
– వాంకుడోత్ బుజ్జి, ఉపాధి కూలీ,
లక్ష్మీపురంతండా, రుద్రంపూర్