జూలూరుపాడు, మే 15 : మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న వరి రకాలను సాగు చేయడం ద్వారా రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని భద్రాద్రి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ టి.భరత్ అన్నారు. జూలూరుపాడు మండలం సాయిరాంతండాలో శుక్రవారం వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘ సభ్యులకు విత్తనోత్పత్తిపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన కొత్త రకాలను ఎంచుకోవాలని సూచిస్తూ, కేవీకే సాంకేతిక సహకారంతో వరి మరియు కంది పంటల్లో చేపడుతున్న విత్తనోత్పత్తి ప్రక్రియలను రైతులకు సవివరంగా వివరించారు. రైతులు అనవసర పోటీతత్వంతో మోతాదుకు మించి రసాయనిక ఎరువులను వాడటం వల్ల భూసారం దారుణంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జీలుగ, జనుము, పిల్లిపెసర, పెసర, మినుము వంటి పచ్చిరొట్ట పైర్లను సాగు చేసి భూమిలో కలియదున్నాలని ఆయన రైతులకు హితవు పలికారు. రైతులు ఒకే రకమైన పంటలను పండించడం వల్ల మార్కెట్లో గిట్టుబాటు ధర లభించడం లేదని, దీనికి ప్రత్యామ్నాయంగా పంట మార్పిడి విధానాన్ని పాటించాలని సూచించారు. తద్వారా సుస్థిర ఆదాయాన్ని పొందడంతో పాటు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాస్త్రవేత్త బి.శివ, సహకార సంఘం అధ్యక్షులు కొమ్మినేని పాండురంగారావు, పీఏసీఎస్ సీఈఓ నరసింహారావు,సంఘ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.