– మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా
రుద్రంపూర్, సెప్టెంబర్ 12 : ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ అందిస్తున్న వివిధ ఉపకార వేతనాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం ప్రవేశం పొందిన ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీడీఎస్, ఇంజినీరింగ్, ఇంటర్ ఒకేషనల్, డిప్లొమా కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.4.50 లక్షల లోపు ఉండి, గత విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులు సాధించిన వారు అర్హులన్నారు.
ఆసక్తి గల విద్యార్థులు తాసీల్దార్ కార్యాలయం నుండి పొందిన ఆధాయ ధ్రువీకరణ పత్రం, గత సంవత్సరం పొందిన మార్కుల జాబితా, విద్యార్థి బ్యాంకు పాస్బుక్, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కుల ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వైద్య విద్యార్థులకు సంవత్సరానికి రూ.50 వేలు, ఇంజినీరింగ్ విద్యార్థులకు రూ.40 వేలు, డిగ్రీ విద్యార్థులకు రూ.20 వేలు, ఇంటర్ ఒకేషనల్ విద్యార్థులకు రూ.15 వేల నిర్ణీత మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారని తెలిపారు. ఇతర వివరాల కోసం ఫౌండేషన్ వెబ్సైట్ https://lic india.in ను సందర్శించాలని లేదా 8520860785 నంబర్ను సంప్రదించాలని యాకూబ్ పాషా సూచించారు.