కొత్తగూడెం గణేష్ టెంపుల్, ఏప్రిల్ 14 : అంబేద్కర్ ఆశయాలు యువతకు స్ఫూర్తి కావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మంగళవారం కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ ప్రధాన కూడలిలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్, ఎస్పీ ముఖ్య అతిథులుగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం రూపకల్పనలో అంబేద్కర్ చేసిన కృషి అపూర్వమని, విద్య, ఆర్థిక, నీటి పారుదల తదితర రంగాల్లో ఆయన చూపిన దూరదృష్టి దేశాభివృద్ధికి పునాది అయిందన్నారు.
ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ.. విభిన్న కులాలు, మతాలు, భాషలు, సంస్కృతులు కలిగిన దేశం అయినప్పటికీ భారతదేశం ఐక్యంగా నిలబడటానికి ప్రధాన కారణం రాజ్యాంగం అన్నారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత రాజ్యాంగం చాలా తక్కువ సవరణలతోనే సమర్థవంతంగా కొనసాగుతుండటం అంబేద్కర్ దూరదృష్టికి నిదర్శనమన్నారు. సమాజంలో మానవతా విలువలకు ప్రాధాన్యం ఇస్తూ, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సమానంగా జీవించేలా కృషి చేయాలని, అంబేద్కర్ స్ఫూర్తిని ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి శ్రీలత, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటరమణ, తూనికలు కొలతలు శాఖ అధికారి మనోహర్, వైద్యశాఖ అధికారి తుకారాం రాథోడ్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత, జిల్లా అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు డాక్టర్ మద్దెల శివకుమార్, సబ్బారపు మధుసూదన్ రావు, పీక కృష్ణ, కుసపాటి శ్రీనివాస్, కోలపూరి ధర్మరాజు, సలింగటి శ్రీనివాస్, కమిటీ కో-కన్వీనర్లు, సభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.