చుంచుపల్లి, జూలై 11 : జూనియర్ వనజీవి విశ్వామిత్ర చౌహాన్ చేపట్టిన వాక్ ఫర్ ట్రీస్ ఉద్యమం సమాజానికి స్ఫూర్తిదాయకమని కొత్తగూడెం నగరపాలక సంస్థ మేయర్ గణేష్ అన్నారు. 1,500వ మొక్క నాటిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంత చిన్న వయసులో 1,500 రోజులుగా నిరంతరాయంగా మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న విశ్వామిత్ర సేవలు ప్రశంసనీయమన్నారు. నేటి విద్యార్థులందరూ విశ్వామిత్రను ఆదర్శంగా తీసుకుని ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్క నాటి దానిని సంరక్షిస్తే పచ్చని తెలంగాణ, పచ్చని భారతం నిర్మాణం సాధ్యమవుతుందన్నారు.