అశ్వారావుపేట: ఓటర్ల జాబితాలో సవరణలకు సహకరించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు రాజకీయ పార్టీల నాయకులకు సూచించారు. పోలింగ్ కేంద్రాల పునర్విభజన, కొత్త కేంద్రాల ఏర్పాటుతో పాటు ఓటర్ల చిరునామాల మార్పునకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు రాజకీయ పార్టీల నుంచి సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఆయన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలో 1,500 ఓటర్ల ఉండేలా జాబితా రూపొందిస్తున్నట్లు వివరించారు. ఓటర్లకు కూడా జాబితా సవరణలపై అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. సమావేశంలో తహసీల్దార్ చల్లా ప్రసాద్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, బీఎల్వోలు పాల్గొన్నారు.