– వెలవెలబోతున్న గరిమెళ్లపాడు హెచ్ఎన్టీసీ
– ఒకప్పుడు 30 లక్షల మొక్కల పెంపకం
– 300 మంది కూలీలకు ఉపాధి
– నేడు ఉనికే కనుమరుగయ్యే పరిస్థితి
చుంచుపల్లి, జూన్ 30 : ఒకప్పుడు రాష్ట్ర ఉద్యాన వన శాఖకు ఆదర్శంగా నిలిచిన చుంచుపల్లి మండలంలోని ప్రశాంతినగర్ పంచాయతీలో గల గరిమెళ్లపాడు హెచ్ఎన్టీసీ (హార్టికల్చర్ నర్సరీ ట్రైనింగ్ సెంటర్) నేడు తన ఉనికినే కోల్పోయే పరిస్థితికి చేరుకుంది. ఒకప్పుడు వేలాది మందికి ఉపయోగపడిన ఈ నర్సరీ ఇప్పుడు ఎందుకు నిర్జీవంగా మారింది? కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తి ఇలా నిర్లక్ష్యానికి గురికావడానికి కారణం ఎవరు? అనే ప్రశ్నలు స్థానిక ప్రజల నుండి ఉత్పన్నమౌతున్నాయి.
సుమారు 72 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ నర్సరీ ఒకప్పుడు ఏటా దాదాపు 30 లక్షల మొక్కలను ఉత్పత్తి చేసి రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలు, ప్రభుత్వ శాఖలు, ఇతర సంస్థలకు సరఫరా చేసేది. మొక్కల విక్రయాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరడంతో పాటు, పర్యావరణ పరిరక్షణలోనూ కీలక పాత్ర పోషించింది. అయితే ప్రస్తుతం ఇక్కడ మొక్కల ఉత్పత్తి దాదాపు నిలిచిపోయింది. నర్సరీ నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడిన ప్రాంతం ఇప్పుడు వెలవెలబోతుంది.
మల్బరీ సాగు, పట్టు పురుగుల పెంపకం, పండ్ల మొక్కలు, అటవీ మొక్కలు, అలంకరణ మొక్కల తయారీతో ఈ కేంద్రం ప్రత్యేక గుర్తింపు పొందింది. రైతులకు ఉద్యాన పంటలపై శిక్షణలు, విద్యార్థులకు ప్రకృతి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో గరిమెళ్లపాడు విద్యా, వ్యవసాయ రంగాల్లో ఆదర్శ కేంద్రంగా నిలిచింది.

Hntc
అత్యంత ఆందోళనకర విషయం ఏమిటంటే ఈ నర్సరీపై ఆధారపడి జీవిస్తున్న సుమారు 300 మంది స్థానిక కూలీలు ఉపాధిని కోల్పోయారు. గతంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) ద్వారా ఏడాది పొడవునా పని లభించేది. ప్రస్తుతం పనులు లేక కుటుంబాల జీవనోపాధి దెబ్బతిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఉన్నతాధికారులు ఈ కేంద్రాన్ని సందర్శించి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని ప్రకటించినప్పటికీ, ఆ హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. సందర్శనలు, సమీక్షలు జరిగాయి కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. గరిమెళ్లపాడును తిరిగి అభివృద్ధి చేస్తే ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది.
హెచ్ఎన్టీసీ పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు కేటాయించడం, భారీ స్థాయిలో మొక్కల ఉత్పత్తిని పునఃప్రారంభించడం, స్థానిక 300 మంది కూలీలకు ఉపాధి కల్పించడం, రైతులకు శిక్షణా కార్యక్రమాలు, విద్యార్థులకు ప్రకృతి విజ్ఞాన పర్యటనలను తిరిగి ప్రారంభించడం, ఐటీడీఏ–ఉద్యానవన శాఖల సమన్వయంతో కార్యాచరణ రూపొందించడం అత్యవసరం. ఒకప్పుడు రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిన గరిమెళ్లపాడు హెచ్ఎన్టీసీ నేడు నిర్లక్ష్యంతో కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంది. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి గరిమెళ్లపాడుకు పూర్వవైభవం తీసుకురావాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

నిర్జీవ కేంద్రంగా ఆదర్శ నర్సరీ