చుంచుపల్లి, ఆగస్టు 28 : ఈ రాఖీ పర్వదినాన ప్రతి ఒక్కరూ తమ సోదరి పేరు మీద ఒక మొక్క నాటి దానిని తోబుట్టువులా సంరక్షించాలని ప్రకృతి ప్రేమికుడు, వాక్ ఫర్ ట్రీస్ జూనియర్ వనజీవి విశ్వామిత్ర చౌహాన్ అన్నారు. విశ్వామిత్ర చౌహాన్ తన సోదరి రోహిత గాంధీతో రాఖీ కట్టించుకున్న అనంతరం తన సోదరులు కశ్యప మిత్ర చౌహాన్, త్రిలోక్ చౌహాన్ తో కలిసి పింకు పనస మొక్క నాటాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాఖీ పండుగ అంటే అన్నా చెల్లెళ్ల ప్రేమకు, రక్షణకు ప్రతీక. అక్కా చెల్లెళ్లతో మనకు ఉన్న అనుబంధం ఎలాంటిదో, చెట్లతో కూడా అదే విధంగా అనుబంధాన్ని పెంచుకోవాలి. ఒక రాఖీ మన బంధాన్ని కాపాడుతుంది, ఒక మొక్క మన భవిష్యత్ను కాపాడుతుందన్నాడు. తాను 3 సంవత్సరాల వయసు నుండి నేటికి 1,548 రోజులుగా ప్రతిరోజూ మొక్కలు నాటుతున్నట్లు తెలిపాడు. పింకు పనస మొక్కలు అరుదైనవని, అవి పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయని, ప్రతి ఇంట్లో ఒక పండ్ల మొక్క ఉండాలని పేర్కొన్నాడు.