– ఆర్థిక సహాయానికి ముందుకొచ్చిన దాతలు
– ‘నమస్తే’ కథనానికి స్పందన
బూర్గంపహాడ్, ఆగస్టు 28 : కిడ్నీ బాధితుడిని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకోవడంతో ‘నమస్తే తెలంగాణ’ ‘ఆపన్న హస్తం కోసం అభాగ్యుడి ఎదురు చూపులు’ అనే శీర్షికన గురువారం కథనం ప్రచురించడంతో దాతలు స్పందించి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకువచ్చారు. బూర్గంపహాడ్ మండల పరిధిలోని వేపలగడ్డ గ్రామానికి చెందిన కణితి రామకృష్ణ అంజనాపురంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. ఇటీవల కాలంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే 24 గంటల కడుపునొప్పికి ఆపరేషన్ కూడా చేయాల్సి రావడంతో శస్త్ర చికిత్స, వైద్యానికి సుమారు రూ.3 లక్షలు అవసరమని వైద్యులు తెలిపారని భార్య, కుటుంబ సభ్యులు వాట్సాప్ ద్వారా దాతలను వేడుకున్నారు.
దీనిపై ‘నమస్తే తెలంగాణ’ కథనం ప్రచురించడంతో శుక్రవారం మాజీ జడ్పీటీసీ బట్టా విజయ్ గాంధీ బట్టా మల్లయ్య మెమోరియల్ ట్రస్టు నుంచి రూ.10 వేలు ఆర్ధికసాయం అందజేశారు. అదేవిధంగా ఈజీఎస్, ఎంపీడీవో, ఎమ్మార్వో కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగుల నుండి రూ.9 వేలు, అంజనాపురం పంచాయతీ కార్యదర్శి రూ.1000, వేపలగడ్డ గ్రామస్థులు, ఇతర దాతల నుండి మరో రూ.10 వేలు కుటుంబానికి ఫోన్ పే ద్వారా సహాయం అందింది. ఈ మొత్తాన్ని రామకృష్ణ కుటుంబ సభ్యులకు దాతలు అందజేశారు. మరికొంత సహాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.