కొత్తగూడెం ఎడ్యుకేషన్, డిసెంబర్ 16: ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్లో పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు శుభవార్త. ఇక నుంచి మీ కార్డును పునరుద్ధరించుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు.. 54 ఏళ్ల పాటు, లేదా.. జాబ్ వచ్చేంత వరకు కార్డు అమలులో ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఇప్పటి వరకు.. ఎంప్లాయ్మెంట్ కార్డును ప్రతి మూడేళ్లకోసారి పునరుద్ధరించుకోవాల్సి వచ్చేది. పునరుద్ధరించుకోకపోతే కార్డు రద్దయ్యేది. ఒకప్పుడు.. ఉపాధి కల్పన కార్యాలయం (ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్) వద్ద రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారంతా బారులు తీరి నిల్చునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
దాదాపుగా అన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తుండడం, ఎవరికి వారు ఆన్లైన్లో దరఖాస్తు చేస్తుండడంతో ఉపాధి కల్పన కార్యాలయం పాత్ర నామమాత్రంగా మారింది. దీంతో, అక్కడ పేరు నమోదు చేసుకుంటున్న, పునరుద్ధరించుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. ఉదాహరణకు.. కొత్తగూడెంలోని ఉపాధి కల్పన కార్యాలయంలో ఇప్పటివరకు 97,000 మంది కార్డులు తీసుకున్నారు. ఇందులో దాదాపుగా 16,330 కార్డులు (పునరుద్ధరించుకోని కారణంగా) రద్దయ్యాయి. దీనిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. జీవితంలో ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే.. పునరుద్ధరణ అవసరం లేకుండా ఉద్యోగం వచ్చేంతవరకు, లేదా.. 54 ఏళ్లు నిండేవవరకు అమలులో ఉండేలా జీవో జారీ చేసింది. ఆ తర్వాత, 61 ఏళ్ల వరకు మూడేళ్లకొకసారి పునరుద్ధరించుకోవాలి. 61 ఏళ్లు దాటితే కార్డు రద్దవుతుంది.
నిబంధనలు మారాయి
ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ అంటే.. ఉద్యోగ సంస్థలు-నిరుద్యోగులకు మధ్య వారధిగా ఉండే కేంద్రం. నిరుద్యోగుల సీనియార్టీ, విద్యార్హత, వయస్సు, కులం ఆధారంగా వారికి ఉద్యోగం వచ్చేలా చూసే ప్రభుత్వ సంస్థ. అభ్యర్థి ఎంప్లాయిమెంట్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ప్రతి మూడేళ్లకోసారి తప్పనరిసరిగా రెన్యువల్ చేసుకోవాల్సి ఉండేది. అలా చేసుకోకపోతే ఆ కార్డు రద్దయ్యేది. మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వచ్చేది. దీంతో అభ్యర్థులకు సీనియార్టీ లాప్స్ అయిపోయేది. ఇప్పుడు నిబంధనలు మారాయి. అభ్యర్థులు ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే 54 ఏళ్ల వరకు/ఉద్యోగం వచ్చేంత వరకు అమలులో ఉంటుంది. నిరక్షరాస్యులు సహా 8,9,10 తరగతులు, ఇంటర్, డిగ్రీ, బీఎడ్, ఏఎన్ఎం, జీఎన్ఎం, డిప్లొమా, ఐటీఐ చదివిన వారు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. పీజీ, ప్రొఫెసనల్ కోర్సులు, బీటెక్, ఎంటెక్, ఎంబీబీఎస్ కోర్సులు చదివిన వారికి యూనివర్సిటీ బ్యూరో ఎక్సేంజ్ ద్వారా కార్డు జారీ అవుతుంది.
– విజేత, జిల్లా ఉపాధి కల్పనాధికారి