ఖమ్మం : మహిళా చట్టాలపై క్షేత్ర స్థాయిలో మహిళలకు అవగాహన కల్పించాలని ఖమ్మం రూరల్ ప్రాజెక్టు సీడీపీఓ సరస్వతి అంగన్వాడీ టీచర్లకు సూచించారు. గురువారం జిల్లా మహిళా శక్తి కేంద్రం ఆధ్వర్యంలో మహిళా చట్టాలు-అవగాహన అనే అంశపై అంగన్వాడీ టీచర్లు ర్యాలీ నిర్వహించారు. నగరంలోని గట్టయ్య సెంటర్ నుంచి ప్రాజెక్టు కార్యాలయం వరకు టీచర్లు, అధికారులు అవగాహన కల్పించారు. అనంతరం ప్రాజెక్టు కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్బంగా సీడీపీఓ మాట్లాడుతూ మహిళా భద్రత, సంక్షేమం, తదితర అంశాలకు సంబంధించి అనేక చట్టాలు ఉన్నాయన్నారు. ఈ చట్టాలపై గ్రామీణ మహిళలకు పూర్తి స్థాయిలో అవగాహన లేదన్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే అంగన్వాడీ టీచర్లు ఈ చట్టాలపై మరింత అవగాహన చేసుకొని క్షేత్ర స్థాయిలో విస్తృత ప్రచారం చేయాలన్నారు. జిల్లా మహిళా శక్తి కేంద్రం, మహిళా సంక్షేమ అధికారిణీ జీ స్వాతి మాట్లాడుతూ పని ప్రదేశాలలో లైంగికవేదింపుల నిరోధక చట్టం-2015, తప్పనిసరి వివాహనమోదు చట్టం 2002, గృహహింస నిరోధకచట్టం-2005, బాల్య వివాహనిషేద చట్టం-2006 తదితర చట్టాలపై ఆమె అవగాహన కల్పించారు.
మహిళా హెల్ప్లైన్కు సంభందించి 181, 100, 1098 తదితర టోల్ ఫ్రీ నెంబర్లను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా శక్తి కేంద్రం జిల్లా కోఆర్డినేటర్లు ప్రమీల, ఎస్డీ సామ్రీన్, ఆయా సెక్టార్ల సూఫర్వైజర్లు, ఐసీపీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.