కారేపల్లి, జూన్ 6 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రమైన కారేపల్లితో పాటు అన్ని గ్రామాల్లో గల ఆరోగ్య ఉప కేంద్రాల్లో శుక్రవారం ఫ్రైడే – డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. సీజనల్ వ్యాధుల పట్ల ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సిబ్బంది ప్రజలకు సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలన్నారు. ఇంటి పరిసరాల్లో కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ డబ్బాలు, పాత కుండలు, పాత టైర్లు, నీరు నిల్వ ఉన్న తొట్లు, పనికిరాని వస్తువులను ఉంచుకోరాదన్నారు.
వాటిల్లో వర్షపు నీరు పడి దోమల లార్వా వృద్ధి చెంది డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధులు ప్రభలుతాయన్నారు. దోమ పుట్టుక, దోమల వల్ల వచ్చే వ్యాధులు, దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అదేవిధంగా ప్రజలకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్హెచ్పీ, ఏఎన్ఎంలు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
Karepalli : కారేపల్లి వ్యాప్తంగా సీజనల్ వ్యాధులపై అవగాహన