బోనకల్లు :గ్రామీణ విత్తనోత్పత్తితో రైతులకు ప్రయోజనమని వ్యవసాయ అధికారులు అరుణజ్యోతి, శరత్బాబు అన్నారు. మంగళవారం మోటమర్రి గ్రామంలో గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద పంపిణీ చేసిన కేఎన్ఎం-18 రకం వరి పంటపై రైతుశిక్షణ కేంద్రం ఖమ్మం కార్యాలయ వ్యవసాయ అధికారి అరుణజ్యోతి, వ్యవసాయ అధికారి శరత్బాబులు రైతులకు పలుసూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ విత్తనోత్పత్తి ద్వారా రైతులు పండించిన ధాన్యాన్ని వారే విత్తనాలుగా వాడుకోవచ్చని పేర్కొన్నారు.
రైతులు ఈ విధంగా పండించిన ధాన్యాన్ని ఆ ఊరి రైతులు కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఇలా సాగు చేయడం ద్వారా రైతులకు అయ్యే విత్తన ఖర్చు తగ్గించవచ్చన్నారు. నాణ్యమైన విత్తనాలు పొందవచ్చని తెలిపారు. రైతులకు కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువలు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి నాగసాయి, సొసైటీ సీఈవో కృష్ణారావు, సిబ్బంది రామకృష్ణ, గ్రామ రైతులు పాల్గొన్నారు.