చింతకాని : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమలవుతున్న బీమా పథకాలను, సంక్షేమ ఫలాలను సద్వినియోగించుకోవాలని ఏపీజీవీబీ బ్యాంకు మేనేజర్ మల్లేశం అన్నారు. రైతులకు, ఏపీజీవీబీ ఖాతాదారులకు నగదు రహిత లావాదేవిలపై మేనేజర్ మల్లేశం సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి జీవన జ్యోతికి రూ.300, సురాక్ష బీమా యోజనకు రూ.12, చెల్లించటం ద్వారా మరణాంతరం రూ.4లక్షలు బీమా పొందవచ్చని పేర్కొన్నారు.
18ఏండ్ల నుంచి 60 ఏండ్ల వయసు వరకూ నెలకు రూ.210 చెల్లించి అటల్ ఫించన్ పథకం ద్వారా జీవితాంతం ఫించన్ పొందవచ్చన్నారు. రైతులు తమ ఋణాలను ఏడాదిలోపు రెన్యువల్ చేసుకుంటే వడ్డీ లేని ఋణాలు పొందవచ్చన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ బ్యాంకు నుంచి కస్టమర్లకు ఎవరూ ఫోన్ చేయరని, అపరిచిత వ్యక్తులు ఫోన్ చేస్తే ఏటీఎం కార్డు నెం, సీవీవీ నెంబర్లు ఎట్టి పరిస్థితుల్లో చెప్పవద్దని సూచించారు.
అటువంటి కాల్స్ ఏమైనా వస్తే ఫిర్యాదు చేయాలన్నారు. అలాగే ప్రజలు డిజిటల్, ఆర్ధిక అక్షరాస్యతను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంగిడి ఝాన్సీ, రైతుబంధుకన్వీనర్ బంధం కృష్ణ, సిబ్బంది డీ మోహన్రావు, గ్రామపెద్దలు, అంగిడి సుధాకర్, సామినేని శ్రీను, బ్యాంకుమిత్రలు, రైతులు పాల్గొన్నారు.