కారేపల్లి, మార్చి 29: సెలవుదినం కావడంతో ఆటలాడుకుంటున్న చిన్నపిల్లల్ని మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తన సరదా కోసం ఆటోలో తీసుకెళ్లి ప్రమాదానికి గురిచేసిన సంఘటన ఖమ్మంజిల్లా కారేపల్లి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కారేపల్లి మండలంలోని పేరుపల్లి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్, యజమాని వజ్జ సునీల్ అనే యువకుడు అతిగా మద్యం సేవించాడు. గ్రామంలో ఆటలు ఆడుకుంటున్న ఆరుగురు విద్యార్థులను తన ఆటోలో సరదాగా ఎకించుకున్నాడు.
పేరుపల్లి నుంచి కోటిలింగాల వెళ్లే మార్గంలో ఆటోను చెకర్లు కొడుతూ తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో జమాల్లపల్లి గ్రామ సమీపంలో తను నడుపుతున్న ఆటోను ఓ విద్యార్థి చేతికిచ్చాడు. దీంతో ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థులు పులసం యశ్వంత్, అలెం స్నేహిత్, ధనసరి భరత్, అలెం తేజ, అలెం చిట్టూ, ధనసరి ప్రవీణ్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు కారేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యశ్వంత్, స్నేహిత్లకు తీవ్రగాయాలు కాగా మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.