ఖమ్మంలో అడుగడుగునా అభివృద్ధి జాడలే కనిపిస్తున్నాయి. విశాలమైన రహదారులు.. డివైడర్ మధ్యలో పచ్చని చెట్లు, సెంట్రల్ లైటింగ్తో నగరం మెరిసి మురిసిపోతున్నది. అంతర్గత రహదారులు అద్దంలా మెరుస్తున్నాయి. నగరం నలుచెరుగులా ప్రగతి పరిమళాలు స్వాగతం పలుకుతున్నాయి. హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఖమ్మం ముందు వరసలో నిలుస్తున్నది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రత్యేక చొరవతో నిధులు కేటాయిస్తుండడంతో అన్ని సౌకర్యాలు సమకూరుతున్నాయి. నగరంలో రూ.30కోట్లతో 140 వాక్యూమ్ డీ వాటరింగ్ రోడ్లు నిర్మించారు. సుడా నిధులు రూ.12 కోట్లతో 173 రహదారులు, రూ.50 కోట్లతో 40 కిలోమీటర్ల సీసీ డ్రెయిన్ల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
ఖమ్మం, ఏప్రిల్ 13:హైదరాబాద్ తరువాత అంతేవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం ఖమ్మం. తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఉన్న ఖమ్మానికి, ఇప్పటి ఖమ్మానికి ఎంతో వ్యత్యాసం ఉంది. మచ్చుకు అంతర్గత రహదారులను చూసినా ఈ విషయం బోధపడుతుంది. నగరంలోని అంతర్గత రహదారులన్నీ ఎంతో విశాలంగా. విస్తారంగా ఉంటాయి. రాష్ట్రీయ, జాతీయ రహదారులను తలపిస్తుంటాయి. మధ్యలోని డివైడర్ సిస్టమ్, సెంట్రల్ లైటింగ్ వంటివి ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇంతటి అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే సాధ్యమైంది. ప్రత్యేకంగా అంతర్గత రహదారులు, సీసీ డ్రెయిన్ల నిర్మాణాలపై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. వివిధ విభాగాల ద్వారా కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తోంది. కిలోమీటర్ల మేర సుందరమైన రహదారులను, సువిశాలమైన డ్రెయిన్లను నిర్మిస్తోంది. అందులోనూ వాక్యూమ్ డీ వాటరింగ్ కాంక్రీట్ ఫ్లోరింగ్ (వీడీఎఫ్) వంటి అధునాత నిర్మాణాలకు మొగ్గుచూపుతోంది.
స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) నిధులు రూ.12 కోట్లతో నగరంలోని 60 డివిజన్లలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రతి డివిజన్కు రూ.20 లక్షల చొప్పున కేటాయించారు. అదేవిధంగా ఒక డివిజన్కు మరో డివిజన్కు కంబైండ్ రోడ్ల కోసం ప్రతి 10 డివిజన్లకు రూ.2 కోట్ల చొప్పున వెచ్చించారు. మొత్తం సుడా నిధులతో 173 సీసీ రోడ్లు నిర్మిస్తున్నారు.
ఈ ఏడాది జనవరి 18న ఖమ్మం బీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఖమ్మం నగర అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు మంజూరు చేశారు. వీటికి తోడు మరికొన్ని ఎల్ఆర్ఎస్ నిధులు, మున్సిపల్ సాధారణ నిధులు కలుపుకొని నగరంలోని 60 డివిజన్లలో ఒక్కో డివిజన్కు రూ.కోటి చొప్పున కేటాయించారు. ఆ నిధులను కేవలం డ్రెయిన్ల నిర్మాణాలకు మాత్రమే వినియోగిస్తున్నారు. దాదాపు 40 కిలోమీటర్ల పొడవునా విశాలమైన సీసీ
డ్రెయిన్లను నిర్మిస్తున్నారు.
నగరంలోని 11వ డివిజన్ నుంచి 48వ డివిజన్ వరకు రూ.30 కోట్లతో వీడీఎఫ్ రోడ్లను నిర్మించారు. లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రోడ్లు, వర్షం నీరు అధికంగా నిల్వ ఉండే రోడ్లు, రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలను గుర్తించి అక్కడ 140 వీడీఎఫ్ రోడ్లను నిర్మించారు. వీటికి తోడు కార్పొరేషన్ సాధారణ నిధుల నుంచి ప్రతి డివిజన్కు రూ.50 లక్షల చొప్పున మొత్తం రూ.60 కోట్లను వెచ్చించి నగర వ్యాప్తంగా సీసీ రోడ్లు, డ్రెయిన్లు, చిన్నచిన్న కాలువలపై వంతెనలు, లింక్ డ్రెయిన్లు నిర్మించారు.
2016లో సీఎం కేసీఆర్ ఖమ్మం నగరంలో పర్యటించి వెళ్లాక అభివృద్ధి పనులు మరింత వేగిరమయ్యాయి. ఈ ఏడాది జనవరి 18న సీఎం కేసీఆర్ ఖమ్మంలో సభలో ఇచ్చిన హామీ మేరకు రూ.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వీటితో నగరంలోని 60 డివిజన్లలో సీసీ డ్రెయిన్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. మున్సిపల్ సాధారణ నిధుల నుంచి ప్రతి డివిజన్కు రూ.50 లక్షల చొప్పున రూ.60 కోట్లను వెచ్చించారు. వాటితో ఇప్పటికే సీసీ రోడ్లు, డ్రెయిన్లు నిర్మించారు. దీంతో దాదాపు ప్రతి గల్లీలోనూ సీసీ రోడ్లు కన్పిస్తున్నాయి.
ప్రజాప్రతినిధికి మంచి విజన్ ఉంటే భవిష్యత్ ఎలా ఉంటుందో ఖమ్మం నగరాన్ని చూస్తే అర్థమవుతుంది. పువ్వాడ అజయ్కుమార్ మంత్రి అయ్యాక సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో అధిక నిధులు తెచ్చారు. ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టి ఖమ్మం రూపురేఖలను మార్చారు..
-పునుకొల్లు నీరజ, కేఎంసీ మేయర్
మంత్రి అజయ్కుమార్ దూరదృష్టి కారణంగానే ఖమ్మం నగరం ఎంతో అభివృద్ధి సాధించింది. నగర అభివృద్ధిలో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చాం. అనేక ప్రాంతాల్లో వీడీఎఫ్ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రెయిన్లు నిర్మిస్తున్నాం. వీటి కోసం సుడా నిధుల నుంచి రూ.12 కోట్లు వెచ్చించాం.
-బచ్చు విజయ్కుమార్, సుడా చైర్మన్
ఖమ్మం నగరంలో కోట్ల రూపాయాలతో అభివృద్ధి పనులను చేపట్టాం. అయితే వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలకు కూడా ఉంది. నగర ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధికి మరింత సహకారం అందించాలి. నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం.
-ఆదర్శ్ సురభి,కేఎంసీ కమిషనర్