అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా జరిగింది. సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. వృద్ధులు, దివ్యాంగులు, బాలింతలు, యువకులు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ అధికారులు ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. సత్తుపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో మోడల్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు.
సత్తుపల్లి నియోజకర్గంలో 85.27శాతం, వైరా నియోజకవర్గంలో 80.57 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సత్తుపల్లి బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సత్తుపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ, ఆయన సతీమణి మహాలక్ష్మి, కుమారులు తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాలను సత్తుపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య గురువారం సందర్శించి పోలింగ్ తీరును పరిశీలించారు. కొణిజర్ల మండలంలో సుమారు 89 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. – నమస్తే నెట్వర్క్