దుమ్ముగూడెం, డిసెంబర్ 28: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న ఈ గ్రేడ్ విద్యార్థునులపై ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత సబ్జెక్టు టీచర్లు 10/10 ర్యాంకులు వచ్చేలా సన్నద్ధం చేయాలని భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతీక్జైన్ అన్నారు. గురువారం మండలంలోని రేగుబల్లి-2 గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. తరగతిగదులను, విద్యార్థుల స్టడీ సామర్థ్యాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు సులభంగా రాయడానికి ప్రత్యేకంగా తయారుచేసిన స్టడీ మెటీరియల్ టెస్ట్బుక్లు ప్రతి పాఠశాలకు పంపిణీ చేయాలన్నారు. సంబంధిత సబ్జెక్టు టీచర్లు బాలికలకు అర్థమయ్యే రీతిలో సులభంగా అర్థం చేసుకునేలా బోధించాలని ప్రతిరోజూ ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. విద్యార్థినులను స్వయంగా ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం నాగమణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.