కామేపల్లి, డిసెంబర్ 4 : వరి కోతలు మొదలయ్యాయంటే పల్లెల్లో హడావుడి.. కూలీలతో పొలాలన్నీ సందడిగా మారేవి. మహిళలు పాటలు పాడుతూ వరి మెదళ్లను కోస్తుంటే కోకిలలు కూసినట్టుండేది, అన్నా, తమ్ముడు, అక్కా, చెల్లి కుటుంబం మొత్తం పొలాల్లో పనుల్లో నిమగ్నమయ్యే వారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది. పొలాల్లో పనిచేస్తూ కనిపించే వారే కరువయ్యారు. దీనికి కారణం పల్లెల్లో యాంత్రీకరణ పెరగడమే. వరి కోత యంత్రాలు పల్లెలకు చేరడంతో రైతులకు పని సులువుగా మారింది. కూలీలతో అవసరం లేకుండానే కొన్ని గంటల్లో వరిని యంత్రంతో కోయిస్తున్నారు. కొన్ని రోజులు పొలంలోనే ఆరబెట్టి తీసుకెళ్లి విక్రయిస్తున్న పరిస్థితి నెలకొన్నది. గ్రామాల్లో వరి కోత యంత్రాలకు భలే గిరాకీ ఏర్పడింది. ప్రస్తుతం ఖరీఫ్ వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కామేపల్లి మండలంలో సుమారు రెండు వేల హెక్టార్లకు పైగా వరి సాగు చేశారు. ఇప్పటికే ఇరువై శాతం వరి కోతలు పూర్తయ్యాయి. ఇప్పటికే సుదూర ప్రాంతాల నుంచి హార్వెస్టర్లు చేరుకున్నాయి. ఎకరం పొలం కోసేందుకు కోత యంత్రం నిర్వాహకులకు రూ.2000 నుంచి రూ.2400 వరకు ధర చెల్లిస్తున్నట్లు రైతులు తెలిపారు. అదే కూలీలతో చేయిస్తే ఎకరానికి సుమారురూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చు వస్తుందంటున్నారు.
నిరీక్షణ తప్పింది..
మండలంలోని కామేపల్లి, ఊటుకూరు, మద్దులపల్లి, ముచ్చర్ల, జాస్తిపల్లి, పండితాపురం, గోవింద్రాల, లింగాల, పింజరమడుగు, పొన్నెకల్, బర్లగూడెం, బాసిత్నగర్ గ్రామాల్లో వరి కోతలు మొదలయ్యాయి. మిషన్ ద్వారా ఎకరం పొలాన్ని కోసేందుకు కేవలం గంట వ్యవధిలో అయిపోతుందని దీంతో సమయం ఆదాతో పాటు ఖర్చు తగ్గుతుందని రైతులు పేర్కొంటున్నారు. సకాలంలో రబీ సాగు చేపట్టే వీలు కూడా ఉంటుందని అంటున్నారు.