భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : పక్షుల కిలకిలారావాలు.. జంతువులు చెంగుచెంగున ఎగిరే శబ్దాలు.. వన్యమృగాల ఘీంకారాలతో పుడమితల్లి పులకరిస్తున్నది. ఒకప్పుడు ఎంతో నిశ్శబ్దంగా ఉన్న అటవీ ప్రాంతం ఇప్పుడు జీవజాలంతో సందడిగా మారింది. అంతరించిపోతున్న కొన్ని జంతువులు, పక్షులు నేడు కనువిందు చేస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని అభయారణ్యం ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నది. ఇందులో సుమారు 120 రకాల పక్షి జాతులు, 10 రకాల జంతువులు తిరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అడవుల సంరక్షణ, జీవవైవిధ్యం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుండడంతో పక్షి, జంతు సంపద గణనీయంగా పెరిగింది. దీంతో తన బిడ్డలను చూసి అడవితల్లి మురిసిపోతున్నది.
అంతరించిపోతున్న జీవజాలానికి రాష్ట్ర సర్కారు మళ్లీ జీవం పోసింది. అడవి అంటే ఇలా ఉండాలి అని మరోసారి నిరూపించింది. పక్షుల కిలకిలరావాలు, జంతువుల చెంగుచెంగున ఎగిరే శబ్దాలు మళ్లీ అడవిలో చిందేస్తున్నాయి. ఎంతో నిశ్శబ్దంగా ఉన్న అటవీ ప్రాంతం ఇప్పుడు పక్షల అరుపులతో సందడిగా మారింది. పురాతన చెరువులు, కుంటలు జలకళను సంతరించుకోవడం, మిషన్ కాకతీయ చెరువులు, చెక్డ్యాంలు నీటితో నిండడంతో పాతకాలపు రోజుల మాదిరిగా పల్లెలు కళకళలాడుతున్నాయి. నాడు అంతరించిపోయిన జంతుజాలం, పక్షులు, కొత్తరకాల జంతువులు అడవుల్లో సంచరిస్తున్నాయి. నాడు కూసిన కోయిలలు, కిలకిల అరుపులతో పక్షుల రాగాలు అడవుల్లో కొత్తరాగాల మోతలు ఘల్లుమంటున్నాయి. ఏ చెరువు వద్ద చూసినా తెల్లకొంగలు, నల్లపిట్టలు, వరినార్ల వద్ద పిచ్చుకలు, అడవుల్లో కొత్త జంతువులు దర్శనమిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక జీవజాతులకు ప్రాణంపోసే విధంగా అడవుల్లో చెరువులు, చెక్డ్యాంల నిర్మాణాలు చేపట్టడంతో జంతువుల నీటి సమస్యకు పరిష్కారం దొరికింది. ఒక జీవి మరొక జీవిపై బతికే పరాన్నజీవుల మనుగడ జీవవైవిధ్యంపై ఆధారపడి ఉంది. అలాంటి జీవవైవిధ్యంపై ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు హరితహారం ద్వారా మొక్కలు పెంచడం వల్ల అడవులు మళ్లీ పచ్చందాల ప్రకృతిని సంతరించుకున్నాయి.
పక్షి, జంతు సంపదపై ప్రత్యేక శ్రద్ధ
అడవి, ఆరుబయట తేడా లేకుండా జనం విచ్చలవిడిగా తిరిగినంతసేపూ జీవజాతులు అడవికి దూరంగా ఉండడం ఖాయమని జగమెరిగిన సత్యం. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా అడవుల్లో తిరిగే జనాలపై నిఘా పెట్టి అడవిలో కేవలం జీవజాతులు మాత్రమే ఉండేలా అటవీ శాఖ చర్యలు తీసుకున్నది. ఇందుకోసం అభయారణ్యంలో అడవి జంతువులు, పక్షి జాతులు జీవించేందుకు రక్షణ చర్యలు చేపట్టింది. అడవిలో నీటి సదుపాయం ఉండేలా సోలార్ బోర్లను ఏర్పాటు చేసి పచ్చిక బైళ్లను పెంచడంతో జీవజాతుల సంతతి బాగా పెరిగింది. భద్రాద్రి జిల్లాలో కిన్నెరసాని అభయారణ్యం నాలుగు డివిజన్ కేంద్రాలుగా ఉంది. ఇందులో 120 రకాలకుపైగా పక్షి జాతులు ఉన్నట్లు ఆ శాఖ గుర్తించింది. ముఖ్యంగా గద్దలు, మంగలిపిట్టలు, ఓరియంటల్ డార్టర్స్(ఇవి నీటిలో మునిగి తేలుతూ ఉండేవి), డోంగ్రో పక్షులు కూడా కొత్తగా వచ్చిన జాబితాలో ఉన్నవి. గతంలో కేవలం 50 రకాల పక్షలు మాత్రమే అడవిలో ఉండేవి.. ఇప్పుడు అవి 120కి పెరిగిపోయాయి. వీటితోపాటు 10 రకాల జంతు జాతులు ప్రస్తుతం అడవిలో తిరుగుతున్నాయి. ఇందులో కొండగొర్రెలు, మచ్చల జింకలు, తోడేళ్లు, కుందేళ్లు, పెద్ద జింకలు, అడవి దున్నలు, ఉడుములు, నక్కలు, పెద్ద ఉడతలు ఎక్కువగా ఉన్నాయి.
మిషన్ చెరువులు, సోలార్ నీటికుంటలు
గుర్రపుడెక్కలతో నిండిన చెరువులకు సర్కారు మిషన్ కాకతీయ పథకం పూర్వవైభవం తెచ్చిపెట్టింది. అడుగంటిన భూగర్భ జలాలు కూడా పెరిగాయి. అడవిలో కూడా అభయారణ్యం పరిధిలో సుమారు 100 చెరువులను తవ్వించారు. 15చోట్ల సోలార్ బోర్లను వేసి నీటికుంటల ద్వారా జంతువులు, పక్షులకు తాగునీటి సౌకర్యాన్ని కల్పించారు. దీనివల్ల జీవజాతులకు నిలయాలుగా మారాయి. మిషన్ చెరువుల వద్ద కొంగలు, పక్షులు పెరుగుతుండగా.. అడవిలో ఇతర పక్షిజాతులు నివాసం ఉంటున్నాయి. ప్రాణులు ఎక్కువగా ఉన్నాయంటే అక్కడ కొత్త జీవాలు వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు రోజువారీ పర్యవేక్షణలో అటవీ శాఖ ఉద్యోగులు వాటి సంతతిని అంచనా వేస్తున్నారు.
పక్షి, జంతుజాతి బాగా పెరిగింది..
అడవిలో విధులు నిర్వర్తించడం అదృష్టంగా భావిస్తున్నా. అడవి అంతరించిపోతుంది అనుకున్నా. కానీ.. ఇప్పుడు రోజురోజుకూ విస్తరిస్తున్నది. హరితహారం, వన సంరక్షణ ద్వారా మొక్కలు పెంచడం వల్ల అడవి బాగా పెరిగింది. దీంతో జీవజాతులు పెరిగిపోయాయి. రోజూ అడవికి వెళ్లి వాటికి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తాం. కొత్త పక్షులు బాగా వచ్చాయి. పిల్లలు పెడుతున్నాయి. గతంలో గద్దలు లేవు. ఇప్పుడు వాటి సంతతి బాగా పెరిగింది.
– కే.మోహన్రావు, ఎఫ్బీవో, బూసురాయి బీట్
వేసవిలో వాటిని కాపాడుకోవాలి..
అన్నికాలాల్లోనూ జీవజాతులు బతికేస్తాయి. కానీ.. వేసవిలో నీటి సౌకర్యం కల్పిస్తే మంచిగా బతుకుతాయి. అభయారణ్యం పరిధిలో ఇప్పటివరకు 100 చెరువులు తవ్వించాం. పచ్చిక మైదానాలు కూడా పెంచాం. నీటి కుంటల వద్ద గడ్డిని ఉంచుతాం. అక్కడ పక్షులు బాగా చేరుతాయి. సోలార్ సిస్టం ద్వారా బోర్లు వేశాం. 15 చోట్ల బోర్లు వేశాం. వేటగాళ్లను నిషేధించాం. పశువులు మేతకు తీసుకొచ్చేవాళ్లకు వేట చేసే ఆయుధాలు వాడొద్దని చెప్పాం. అభయారణ్యంలో సిబ్బంది పని చేస్తున్నారు. కంచెను కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఆళ్లపల్లి ప్రాంతంలో విజిటింగ్ పులి వచ్చింది. 120 రకాల పక్షిజాతులు ఉన్నాయి. గతంతో పోల్చితే బాగా పెరిగింది.
– దామోదర్రెడ్డి, డీఎఫ్వో, అభయారణ్యం కిన్నెరసాని