లక్ష్మీదేవిపల్లి, ఏప్రిల్ 11: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ ఎదుట దీక్షలు చేస్తున్న ఆర్టిజన్లకు సంఘీభావం తెలపడానికి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న సుమారు 60 మందిని లక్ష్మీదేవిపల్లి పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలోని ఇతర విద్యుత్ ప్లాంట్లలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులు రెండు బస్సుల్లో కొత్తగూడెం మీదుగా పాల్వంచలోని కేటీపీఎస్కు వెళ్లి దీక్షకు సంఘీభావం తెలపడానికి వస్తుండగా సమాచారం తెలుసుకున్న లక్ష్మీదేవిపల్లి ఎస్సై రమణారెడ్డి ఆ బస్సులను అడ్డుకున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా బస్సుల్లో వస్తున్న వారందరినీ లక్ష్మీదేవిపల్లి పోలీస్స్టేషన్కు తరలించి విచారించారు.
శాంతియుత మార్గంలో ఆందోళన చేస్తున్న ఆర్టిజన్లకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకుని అదులోకి తీసుకోవడం హేయమైన చర్య అని వారు అభిప్రాయపడ్డారు. మా న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ దీక్షలు కొనసాగిస్తున్న తోటి ఆర్టిజన్లకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, మా ఆందోళనను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, లేనిపక్షంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.