ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 7 : భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో జాతరలో విధులు నిర్వర్తించాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని తీర్థాల గ్రామంలో గల సంగమేశ్వరస్వామి దేవాలయ ఆవరణలో కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి మహాశివరాత్రి ఏర్పాట్లపై సమీక్ష చేశారు. తొలుత ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ మార్చి 7 నుంచి 11వ తేదీ వరకు ఐదు రోజులపాటు తీర్థాల జాతర జరగనున్నట్లు తెలిపారు. సుమారు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు జాతరకు తరలి రానున్నట్లు అంచనా ఉందన్నారు. గతంలో కంటే గొప్పగా జాతర జరిగే విధంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. పారిశుధ్య నిర్వహణకు చర్యలు చేపట్టడంతోపాటు గ్రామ శివారులో పార్కింగ్ స్థలాలను గుర్తించి చదును చేయాలన్నారు. మిషన్ భగీరథ నీటిని భక్తుల అవసరానికి తగ్గట్లుగా నిల్వ చేస్తామన్నారు.
స్నానాల కోసం నదిలోని నీటిని చెక్డ్యాం నుంచి పంపే ఏర్పాట్లు చేయాలన్నారు. రహదారుల ప్యాచ్ వర్క్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కామంచికల్ వద్ద 125 మీటర్ల మేర రోడ్డు పనులు పూర్తి చేయాలన్నారు. పల్లెగూడెం, గోళ్లపాడు రోడ్డు నిర్మాణానికి సర్వే చేసి ప్రతిపాదనలు పంపాలన్నారు. కల్యాణ మండపంతోపాటు నదికి కరకట్ట స్థలం వదిలి డబుల్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలన్నారు. సమీక్షలో డీపీవో హరికిషన్, ఉపాధి కల్పన అధికారి కే శ్రీరాం, ఆర్డీవో గణేశ్, ఏసీపీ బస్వారెడ్డి, పీఆర్ ఈఈ పాండురంగ విఠల్, మిషన్ భగీరథ ఈఈలు పుష్పలత, వాణిశ్రీ, మత్స్య శాఖ అధికారి ఆంజనేయులు, దేవాదాయ శాఖ సూపరింటెండెంట్ గౌరీశంకర్, ఎంపీపీ బెల్లం ఉమ, ఎంపీడీవో రవీందర్రెడ్డి, తహసీల్దార్ పీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.