జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు పౌరసరఫరాల శాఖ అధికారులు రంగం సిద్ధం చేశారు. 150 కేంద్రాలకు గాను ఇప్పటికే 120 కేంద్రాలను ప్రారంభించారు. శాసనసభ ఎన్నికలు కావడం.. కోడ్ అమలులో ఉండడంతో ఆయా సంఘాల చైర్మన్లు, సొసైటీల సభ్యులు, అధికారులు తమ గ్రామాల్లో కేంద్రాలను ప్రారంభించారు. ఈ ఏడాది 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించగా.. గన్నీ బ్యాగులు, తేమ శాతాన్ని కొలిచే యంత్రాలను కల్లాల వద్ద అందుబాటులో ఉంచారు. ఐకేపీ, జీసీసీ, సొసైటీ, మార్కెటింగ్ శాఖల ద్వారా విక్రయాలు జరిపేందుకు ఆయా శాఖల అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 1,15,119 ఎకరాల్లో రైతులు వరి పంట సాగుచేశారు. అయితే తుపాను కారణంగా తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : ఇటీవలి తుసాన్ కారణంగా కురిసిన వర్షాలకు ధాన్యం తడిసి ముద్దయింది. రైతులకు భారీగానే నష్టం జరిగింది. అయితే తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తుండడంతో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. వ్యవసాయాధికారులు మాత్రం నష్టపోయిన పంటలను అంచనా వేశారు. పౌరసరఫరాల శాఖ అధికారులు ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్ధం చేశారు. కేంద్రాలను కూడా ప్రారంభించారు. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 1,15,119 ఎకరాల్లో రైతులు వరి పంట వేశారు. . జిల్లాలో 150 కేంద్రాలకు గాను.. ఇప్పటికే 120 కేంద్రాలను ప్రారంభించారు. ఎన్నికల సమయం అయినందుకు ఆయా సంఘాల చైర్మన్లు, సొసైటీల సభ్యులు ఈ కేంద్రాలను ప్రారంభించారు. ఈ ఏడాది 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం గన్నీ బ్యాగులను, తేమ శాతాన్ని కొలిచే యంత్రాలను అధికారులు కల్లాల వద్ద అందుబాటులో ఉంచారు. ఐకేపీ, జీసీసీ, సొసైటీ, మార్కెటింగ్ శాఖల ద్వారా విక్రయాలు జరిపేందుకు ఆయా శాఖల అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు.
వరి పంట విక్రయాలకు రైతులు సిద్ధం చేసుకోవడంతో ప్రభుత్వం మద్దతు ధర కూడా ఇప్పటికే ప్రకటించింది. ‘ఏ’ గ్రేడ్ రకానికి రూ.2,203, కామన్ రకానికి రూ.2,183 రేటును నిర్ణయించారు. అయితే, రైతులు దళారుల బారిన పడకుండా అధికారులు కొనుగోలు కేంద్రాల వద్దనే విక్రయాలు జరుపుతున్నారు. ధాన్యం ఆరబోసుకోవడానికి ప్రత్యేక స్థలాలను కూడా కేటాయించారు.
తుపాన్ ప్రభావంతో రైతులు పంటలను భారీగానే నష్టపోయారు. తడిసిన ధాన్యం కొనుగోలుపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. దీంతో రైతులు ఆయోమయంలో పడ్డారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 120 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాం. ఈ ఏడాది 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. రైతులకు అవసరమైన గన్నీ బ్యాగులను, తేమ శాతం నిర్ధారణ యంత్రాలను ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాం. ధాన్యం ఆరబోసుకోవడానికి ప్రదేశాలు కూడా ఉన్నాయి. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసుకోవడానికి టార్పాలిన్లను అందుబాటులో ఉంచుతున్నాం. ధాన్యాన్ని విక్రయించే రైతులు తమ బ్యాంకు అకౌంట్ పాస్బుక్ను, ఆధార్ కార్డును తీసుకురావాలి. -త్రినాథ్బాబు, డీఎం, సివిల్ సప్లయీస్, భద్రాద్రి జిల్లా