‘జై.. జై గణేశా.. జై కొడతా గణేశా.. జయములివ్వు బొజ్జ గణేశా..’, ‘జయ జయ శుభకర వినాయకా శ్రీకాణిపాక వరసిద్ధి వినాయక’, ‘ఉండ్రాళ్లయ్యా.. దండాలయ్యా..’, ‘ఓ బొజ్జ గణపయ్య.. నీ బంటు నేనయ్యా..’, ‘వక్రతుండ మహాకాయ.. సూర్యకోటి స్వయం ప్రభ’ అనే పాటలు వీధి వీధినా మార్మోగనున్నాయి.. ‘శుక్లాం బరధరం.. విష్ణుం శశివర్ణం చతుర్భుజం..’ అంటూ అర్చకులు విఘ్నేశ్వరునికి పూజలు, ‘గణపతి బప్పా మోరియా’ అంటూ భక్తులు జయ జయ ధ్వానాలు చేయనున్నారు.. సోమవారం వినాయక చవితి సందర్భంగా గణేశ్ మండపాల్లో ప్రత్యేక పూజలు జరుగనున్నాయి. తొమ్మిదిరోజుల పాటు ఉత్సవాలు ఉత్సాహంగా సాగనున్నాయి. ఈమేరకు ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. – ఖమ్మం
ఖమ్మం, సెప్టెంబర్ 17: ‘శుక్లాం బరధరం.. విష్ణుం శశివర్ణం చతుర్భుజం.. ప్రసన్న వదనం ధ్యాయేత్.. సర్వ విఘ్నోపశాంతయే..’ అని గణపయ్యను కొలుచుకునే పండుగ వచ్చేసింది. సకల విఘ్నాలను తొలగించి.. సకల శుభాల్ని కలిగించే దేవగణాల గురువు విఘ్నాధిపతి మండపాల్లో కొలువుదీరనున్నాడు. తొమ్మిది రోజుల పాటు పూజలందుకోనున్నాడు. సోమవారం తొలిరోజు వినాయక చవితి సందర్భంగా అర్చకులు గణపయ్యకు పూజలు చేసి నవరాత్రోత్సవాలను ప్రారంభించనున్నారు.
పట్టణాలను నుంచి గ్రామాల వరకు ఇప్పటికే మండపాలు ముస్తాబయ్యాయి. వాటి ఎదుట చలువ పందిళ్లు వెలిశాయి. లైటింగ్ అందుబాటులోకి వచ్చింది. రెండు జిల్లాల వ్యాప్తంగా సుమారు 40 వేల మండపాల్లో గణనాథులు కొలువుదీరనున్నట్లు ఓ అంచనా. ఆయ మండపాల్లో ఉత్సవ కమిటీ సభ్యులు సుమారు ఐదు అడుగుల నుంచి 20 అడుగుల ఎత్తు వరకు ఉన్న విగ్రహాలను నిలిపారు. ఒక్క ఖమ్మం నగరంలోనే 2,000 విగ్రహాలను ఏర్పాటు చేశారు.
గణపతి పూజలు..
వినాయక చివితి నాడు భక్తులు వేకువ జామునే నిద్రలేస్తారు. పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ఇళ్లను శుభ్రం చేసుకుని ద్వారాలకు మామిడి తోరణాలు కడతారు. గదిలో ఈశాన్య మూల స్థలాన్ని శుద్ధి చేస్తారు. బియ్యపు పిండి లేదా రంగులతో ముగ్గులు వేస్తారు. పాలవెల్లి కట్టి దేవుడికి పీట వేస్తారు. పీటకు పసుపు, కుంకుమ బొట్లు పెడతారు. దానిపై గణపతి విగ్రహాన్ని నిలుపుతారు. తొలుత గణపతికి ప్రార్థన చేస్తారు. కలశాన్ని నూతన వస్త్రంతో అలంకరించి గణపతిని ఆవాహన చేస్తారు. దీపారాధన చేపడతారు. ఫల.. పుష్ప.. పత్రాలతో పూజ చేస్తారు. ధూప దీప నైవేద్యాలతో గణపయ్యను ప్రసన్నం చేసుకుంటారు. గణపయ్యకు ఇష్టమైన ఉండ్రాళ్లు, తెల్ల నువ్వులు కలిపిన మోదకాలు, అప్పాలు, లడ్డూలు, పరమాన్నం, కుడుములను సమర్పిస్తారు.
వినాయక వ్రత కథ..
చంద్రవంశానికి చెందిన ధర్మరాజు సిరి సంపదలను పోగొట్టుకుంటాడు. కుటుంబంతో వనవాసం చేస్తూ నైమిశారణ్యానికి చేరుకుంటాడు. అక్కడ శౌనకాది రుషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహామునిని దర్శించుకుంటాడు. ధర్మరాజు తన పూర్వ వైభవం కోసం చేయాల్సిన వ్రతాన్ని చెప్పమని సూతుని అడుగుతాడు. వినాయక వ్రతం చేస్తే సకల కష్టాలు తొలగిపోయి, సకల సౌఖ్యాలు కలుగుతాయని చెబుతాడు సూతుడు. ధర్మరాజు వ్రతం చేసి తిరిగి పూర్వ వైభవాన్ని పొందుతాడు. ఇదే వత్రం గురించి పరమశివుడు తన కుమారుడైన కుమారస్వామికి చెప్తాడు. వ్రతమాచరించి కుమారస్వామి వెలుగొందుతాడు. విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడంతోనే తాను ఇష్టపడిన నలమహారాజును పెళ్లి చేసుకున్నది. శ్రీకృష్ణుడు ఈ వ్రతం చేయడంతోనే శమంతకమణితో పాటు జాంబవబి, సత్యభామను సతీమణులను చేసుకున్నాడు.
వినాయక జననం..
పార్వతిదేవి స్నానమాచరించడానికి వెళుతూ నలుగుపిండితో ఒక ప్రతిమను చేస్తుంది. ప్రతిమకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తుంది. ఆ చిన్నారిని కాపలాగా ఉంచుతుంది. చిన్నారి వాకిట్ల్లోనే నిలుస్తాడు. లోపలికి ప్రవేశిస్తున్న పరమశివుడిని అడ్డిగిస్తాడు. శివుడు ఆగ్రమించి చిన్నారి శిరచ్ఛేదనం చేస్తాడు. స్నానమాచరించి బయటకు వచ్చిన పార్వతి విగతజీవుడిడైన చిన్నారిని చూసి విలవిలలాడుతుంది. దీంతో శివుడు కూడా చింతిస్తాడు. వెంటనే గజాసురుని శిరస్సును చిన్నారి మొండేనికి అతికించి, ఆ శిరస్సుకు శాశ్వతత్వాన్ని కలిగిస్తాడు. ఆ చిన్నారే వినాయకుడవుతాడు. శివపార్వతుల ముద్దుల బిడ్డ అవుతాడు. సర్వ విఘ్నాలకు అధిపతి అవుతాడు.
వీధుల్లో సందడి
సోమవారం వినాయక చవితి సందర్భంగా ఆదివారం ఉమ్మడి జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో సందడి కనిపించింది. గణపత్రి విగ్రహాలు, పత్రి, ఫలాలు, పత్రి కొనుగోలు చేస్తూ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు కనిపించారు. గ్రామాల నుంచి సేకరించిన మారేడు, వాకుడు, గరికె, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, మర్రి, మామిడి, గన్నేరు, విష్ణుక్రాంతం, దానిమ్మ, దేవదారు, మధుపం, సింధువారం, జాజీపత్రం, గండకి, శమి, రావి, మద్ది, తెల్లజిల్లేడు పత్రాలను విక్రయిస్తూ వ్యాపారులు కనిపించారు. ఎన్జీవోలు, ట్రస్ట్లు, సామాజిక సేవ కార్యకర్తలు భక్తులకు ఉచితంగా మట్టి గణపతులు అందించారు. ఖమ్మం నగరంలో స్తంభాద్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నవరాత్రోత్సవాలు జరుగనున్నాయి.