మామిళ్లగూడెం, మార్చి 19 : పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో ఎక్కడా లోపాలు లేకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పోలీస్ కమిషనర్ సునీల్దత్తో కలిసి లోక్సభ ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంతో కీలకమైన ఎన్నికల విధుల్లో చిన్న తప్పిదానికి తావివ్వకుండా అంతా సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న స్రూట్నీ, 29 వరకు అభ్యర్థుల ఉపసంహరణ ఉండగా.. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ ఉంటుందన్నారు. ఫ్లయింగ్ స్వాడ్ బృందాలకు వాహనాలు సమకూర్చామని, నిఘా బృందాలు తమకు కేటాయించిన ప్రదేశాల్లో విధులు నిర్వర్తించాలన్నారు. క్రిటికల్, వనరబుల్ పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ పూర్తి కావాలన్నారు. ప్రతి పోలింగ్ బూత్లో సీసీ కెమెరాలు వంద శాతం ఏర్పాటు చేయాలని, పోలీసుల నివేదిక మేరకు కేంద్రాల వెలుపల సీసీ కెమెరాలు ఉండాలన్నారు. ఏఆర్వోలు, పోలీస్ అధికారులు తమ పరిధిలోని ప్రతి కేంద్రాన్ని సందర్శించి.. మౌలిక సదుపాయాలు, భద్రతా పరంగా చేపట్టాల్సిన చర్యల గురించి కార్యాచరణ చేయాలన్నారు. సువిధ సింగిల్ విండో ద్వారా అనుమతులు జారీ చేయాలని, నిర్ణీత కాలవ్యవధిలోగా అనుమతులు ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఆయా సెగ్మెంట్ల పరిధిలోనూ, రిసెప్షన్ కేంద్రం కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల పరిశీలకులు సందర్శించేలోగా కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. సీ-విజిల్ పై యువతతో సమావేశాలు నిర్వహించి విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. 85 ఏళ్ల పైబడిన వారికి, దివ్యాంగులకు హోం ఓటింగ్ నిమిత్తం ఫారం-12డీలను ఇంటింటికీ అందజేయాలన్నారు.
అక్రమ నగదు, లికర్ పంపిణీ, ప్రలోభాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సీపీ సునీల్దత్ ఆదేశించారు. జిల్లాలో 12 ఎఫ్ఎస్టీ, 15 ఎస్ఎస్టీ, 2 ఇంటిగ్రేటెడ్ ఇంటర్ స్టేట్ చెక్పోస్టులు, 10 ఇంటర్ స్టేట్ చెక్పోస్టులు, 8 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్పోస్టులు ఏర్పాటు చేసి.. 24 గంటల నిఘా ఉంచినట్లు తెలిపారు. ప్రచార సామగ్రిపై ప్రచురణకర్త పేరు, వివరాలు లేకుంటే సీజ్ ఆయా షాపులను చేయాలన్నారు. సీజర్ సమయంలో అన్ని నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. క్రిటికల్, వనరబుల్ పోలింగ్ కేంద్రాల గుర్తింపు మార్గదర్శకాల మేరకు చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు బి.సత్యప్రసాద్, డి.మధుసూదన్నాయక్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా సహాయ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్, శిక్షణా ఐపీఎస్ పి.మౌనిక, అదనపు డీసీపీ ప్రసాదరావు, భద్రాద్రి కొత్తగూడెం అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఎస్డీసీ ఎం.రాజేశ్వరి, ఖమ్మం, కల్లూరు, కొత్తగూడెం ఆర్డీవోలు గణేశ్, శ్రీనివాస్, మధు, డీసీవో మురళీధర్రావు, ఐటీ అధికారి సాయికుమార్, జిల్లా శిక్షణ నోడల్ అధికారి కే.శ్రీరామ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.