భద్రాద్రి కొత్తగూడెం, మే 18 (నమస్తే తెలంగాణ) : వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని భద్రాద్రి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు. శనివారం ఐడీవోసీ సమావేశ మందిరంలో ఏఆర్వోలు, నోడల్ ఆఫీసర్లు, తహసీల్దార్లతో పోలింగ్ అధికారుల నియామకం, ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 27న, కౌంటింగ్ జూన్ 5న ఉన్నట్లు చెప్పారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 55 పోలింగ్ కేంద్రాలు, 76 మంది పీవోలు, 76 మంది ఏపీవోలు, 160 మంది వోపీవోలు అవసరం ఉన్నట్లు చెప్పారు. ఆ దశగా ఏర్పాట్లు చేయడంతోపాటు పోలింగ్ విధులకు సిబ్బందిని కేటాయించాలన్నారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా తప్పిదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 5 ఫ్లయింగ్ స్కాడ్, 5 ఎంసీసీ బృందాలను ఏర్పాటు చేసి నిఘా పకడ్బందీగా చేపట్టాలన్నారు. జిల్లాలో 40,106 మంది పట్టభద్రుల ఓటర్లు నమోదు కాగా.. ఇందులో 22,590 మంది పురుషులు, 17,516 మంది మహిళలు ఉన్నారన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాశయ్య, ఆర్డీవోలు మధు, దామోదర్రావు, ఎన్నికల సూపరింటెండెంట్ దార ప్రసాద్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ రంగా ప్రసాద్, నోడల్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.