ఖమ్మం : అవాంచిత గర్బం ద్వారా పుట్టిన పిల్లలు ఇష్టం లేకుంటే తమకు అప్పగించాలని, కంటికి రెప్పలా చూసుకొని వేరొకరికి దత్తత ఇస్తామని జిల్లా స్త్రీ శిశుసంక్షేమ శాఖ అధికారి సీహెచ్ సంధ్యారాణీ తెలిపారు. పుట్టిన పిల్లలను పొదల్లో, ఇతర నిర్జీవ ప్రాంతాలలో వదిలేయడం వల్ల శిశువు ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. పిల్లలు ఇష్టం లేకపోతే తమకు నేరుగా కాకుండా ఇతర మార్గాల ద్వారా అయినా అప్పగించ వచ్చన్నారు. ఖమ్మం ప్రధాన వైద్యశాల మాతాశిశు విభాగంలో ఇందుకోసం ప్రత్యేకంగా ఊయల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
అంతేకాకుండా గట్టయ్య సెంటర్ ప్రాంతంలోని బాల రక్షాభవన్ అధికారులను సంప్రదించవచ్చన్నారు. ఎక్కువ మంది ఆడపిల్లలు ఉన్న తల్లితండ్రులు, పేదరికంతో పిల్లలను పెంచే శక్తి లేనివారు, తల్లితండ్రులు చనిపోయిన పిల్లలను సైతం ఈ ఊయాలలో ఉంచవచ్చన్నారు. అలాంటి పిల్లలను చేరదీసి శిశుగృహలో ఉంచి వారి ఆలనా, పాలన చూసుకోవడం జరుగుతుందన్నారు.
అదే విధంగా పిల్లలు లేని తల్లితండ్రులు సైతం పిల్లల దత్తత కోసం తమ కార్యాలయాన్ని సంప్రదించవచ్చన్నారు. నియమనిబంధనల ప్రకారం దంపతుల పాన్కార్డు, ఆధార్కార్డు, వివాహ దృవపత్రం, ఆరోగ్య దృవపత్రాలను జత పరచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వెబ్సైట్ CARA.NIC.IN లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం మూడు సెట్ల జిరాక్స్ పత్రాలను రూ. 6వేల డీడీని తమ కార్యాలయంలో అందజేయాలని ఆమె సూచించారు. దరఖాస్తుల సీనియారిటి ప్రకారం పిల్లలను దత్తత ఇవ్వడం జరుగుతుందన్నారు. పూర్తి వివరాల కోసం నగరంలోని శిశుగృహ అధికారులకు సంప్రదించవచ్చన్నారు.