కొత్తగూడెం క్రైం, జనవరి 17: విజబుల్ పోలీసింగ్కి ప్రాధాన్యమిస్తూ పోలీసు శాఖపై ప్రజల్లో మరింత భరోసాని పెంచాలని ఎస్పీ రోహిత్రాజు సూచించారు. కొత్తగూడెం వన్టౌన్ పోలీస్ స్టేషన్ను బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. తొలుత పోలీస్ స్టేషన్లోని రికార్డులను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా విజబుల్ పోలీసింగ్కి ప్రాధాన్యమివ్వాలని, స్టేషన్కు వచ్చే అర్జీదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ప్రదేశాల్లో పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ నిరంతరం వారు ఆ ప్రాంతాల్లో బీట్ నిర్వహించేలా ఎస్హెచ్వోలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేరస్తులకు శిక్ష పడే విధంగా చొరవ తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. అసాంఘిక శక్తులు, రౌడీషీటర్లపై నిఘా ఉంచి వారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ పోలీస్ అధికారి, సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవలందించాలని తెలిపారు. వన్టౌన్ ఇన్స్పెక్టర్ ఎం.కరుణాకర్, ఎస్సైలు సాయికిశోర్రెడ్డి, విజయ, సిబ్బంది పాల్గొన్నారు.