ఖమ్మం కమాన్బజార్, ఆగస్టు 4: నిరుద్యోగుల ఆగ్రహంతో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ పతనం ఖాయమని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంతో గొప్పగా చెప్పుకున్న యూత్ డిక్లరేషనే నేడు యూజ్లెస్గా మారి రాష్ట్రంలోని నిరుద్యోగుల పాలిట మరణ శాసనంగా మారిందని విమర్శించారు. ఎన్నికల హామీలను అటకెక్కించి నిరుద్యోగులను నిలువునా మోసం చేసిందని ధ్వజమెత్తారు. గ్రూప్స్ నోటిఫికేషన్ వేయకపోవడం, జాబ్ క్యాలెండర్ను అమలు చేయకపోవడం వంటి కారణాలతో తీవ్ర మనస్తాపం చెందిన మధిర నియోజకవర్గానికి చెందిన వేణుకుమార్ ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం విదితమే.
ఖమ్మంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేణుకుమార్ను రాకేశ్రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని ధైర్యం చెప్పారు. అనంతరం, ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వేణు ఆవేదన అతడి ఒక్కడిది కాదని, రాష్ట్రంలోని నిరుద్యోగుల గుండెకోత అని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రూప్స్ కోసం ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్నా సరైన సమయంలో నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, జాబ్ క్యాలెండర్ అమలు చేయకపోవడం, తద్వారా పేదరికాన్ని జయించలేకపోవడం వంటి కారణాలతోనే వేణుకుమార్ ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. వేణు అంతటి నిర్ణయం తీసుకోవడం అత్యంత బాధాకరమని అన్నారు. వేణు రాసిన మూడు పేజీల సూసైడ్ నోట్ కేవలం అతడి ఒకడి ఆవేదన మాత్రమే కాద ని.. తెలంగాణలోని లక్షలాది మంది ఉద్యోగార్థుల గుండెల్లో మండుతున్న ఆక్రోశమని స్పష్టం చేశారు.
వేణు సూసైడ్ నోట్ చూశాక కాంగ్రెస్ ప్రభుత్వం భయపడిందని రాకేశ్రెడ్డి స్పష్టం చేశారు. అందుకే ఆ లేఖలోని పుటలను బయటకు రాకుండా తొక్కి పట్టే ప్రయత్నం చేసిందని, చివరకు అది ప్రేమ వ్యవహారమనేలా చిత్రించి తప్పుదోవ పట్టించే కుట్రకూ పాల్పడిందని విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, యూత్ డిక్లరేషన్లు అంటూ ఎన్నికల సమయంలో బాండ్ పేపర్లు పట్టుకొని ఊరూరా తిరిగిన రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్కలు.. వేణుకుమార్ ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ‘ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి? మెగా డీఎస్సీ జాడ ఏది? జాబ్ క్యాలెండర్ ఎక్కడ? నిరుద్యోగ భృతి ఏమైంది? జీవో 46 రద్దు హామీలు ఎటుపోయాయి?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జాబ్ అప్లికేషన్ల ఫీజుల పేరిట విమర్శలు చేసిన కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల దరఖాస్తులకు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు ఎలా వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. నిరుద్యోగుల రక్తాన్ని పిండుకుంటున్నారని ధ్వజమెత్తారు. కమీషన్లు వచ్చే బిల్లులు, కాంట్రాక్టులపై ఉన్న శ్రద్ధ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి సొంత జిల్లాలోనే అత్యంత పేద కుటుంబానికి చెందిన వేణుకు కనీసం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయకపోవడం కాంగ్రెస్ దౌర్భాగ్యానికి నిదర్శనమని విమర్శించారు. కేవలం సొంత పార్టీ వాళ్లకే ఇళ్లు ఇచ్చుకుంటున్నారని ఆరోపించారు. కష్టాల్లో ఉన్న వేణును బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారని తెలిపారు. నిరుద్యోగులెవరూ ధైర్యం కోల్పోవొద్దని; జాబ్ క్యాలెండర్ అమలు చేసే వరకూ పోరాడుతామని కేటీఆర్ భరోసానిచ్చారని వివరించారు.
ఆసుపత్రి యాజమాన్యంపై అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెస్తూ వేణును డిశ్చార్జ్ చేయించే కుట్రకు పాల్పడుతున్నారని రాకేశ్రెడ్డి ఆరోపించారు. అతడికి హైదరాబాద్ లో అత్యుత్తమ వైద్యం అందించాలని, తక్షణ సాయంగా రూ.5 లక్షలు అందించాలని, పకా ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ ఉద్యోగాలను 7,000 నుంచి 19,000 పెంచాలని, అభ్యర్థుల వయోపరిమితిని సడలించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ ప్రకారం తక్షణమే స్పష్టమైన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తరాదిలో వచ్చిన జెన్జీ ఉద్యమంలా తెలంగాణలో కూడా నిరుద్యోగుల సునామీ రాబోతోందని, అది ఖమ్మం నుంచి మొదలుకానుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి అదే కారణమవుతుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు గూడ సంజీవ్రెడ్డి, బలుసు మురళీకృష్ణ, మద్దెల విజయకుమార్, ఈదుల రాజేశ్, షారూక్, జడల కల్యాణ్, సాయిదీప్, సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.