ఖమ్మం, జూలై 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి జిల్లాల్లో ముగ్గురు ఐఏఎస్లకు స్థాన చలనం కలిగింది. భద్రాద్రి కలెక్టర్గా ప్రియాంక ఆలాను, భద్రాచలం ఐటీడీఏ పీవోగా ప్రతీక్ జైన్ను, ఖమ్మం అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా అభిలాష అభినవ్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగూడెం కలెక్టర్గా సుదీర్ఘకాలం పనిచేసిన అనుదీప్ హైదరాబాద్ కలెక్టర్గా బదిలీ అయ్యారు. భద్రాచల ఐటీడీఏ పీవో పొట్రు గౌతమ్కు సెర్ప్ సీఈవోగా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. కొత్తగూడెం కలెక్టర్గా నియమితులైన ప్రియాంక ఆలా ప్రస్తుతం జీహెచ్ఎంసీలో అదనపు కమిషనర్గా పనిచేస్తున్నారు. రంగారెడ్డి అదనపు కలెక్టర్గా ఉన్న ప్రతీక్ జైన్ను భద్రాచలం ఐటీడీఏ పీవోగా నియమితులయ్యారు. ఖమ్మం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలిని జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా నియమితులయ్యారు. మహబూబాబాద్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్కు ఖమ్మం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా పోస్టింగ్ పొందారు.
రెండేళ్లు పనిచేసిన అనుదీప్..
భద్రాద్రి జిల్లా పాలనపై తనదైన ముద్ర వేశారన్న పేరు తెచ్చుకున్నారు కలెక్టర్ అనుదీప్. ప్రభుత్వ పథకాల అమలు, సీతారామ ప్రాజెక్టు భూసేకరణ వంటి కీలక అంశాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. నిరుడు గోదావరి వరదలను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. 2018లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న ఆయన.. 2021 మే 5న కలెక్టర్గా పూర్తి బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల 45 రోజులు పనిచేశారు. ఐటీడీపీవో గౌతమ్, ఖమ్మం అదనపు కలెక్టర్ స్నేహలత కూడా సమర్థవంతంగా పనిచేశారు.