సత్తుపల్లి, మార్చి 27 : చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు కరువయ్యాయి. దీంతో అరకొర వసతులున్న అద్దె భవనాల్లోనే అంగన్వాడీ టీచర్లు ఆయా కేంద్రాలను నెట్టుకొస్తున్నారు. జిల్లాలో మొత్తం ఏడు ప్రాజెక్టుల పరిధిలో 1,840 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేవు. ఆయా ప్రాంతాల్లో ఇరుకు ఇళ్లలోనే అద్దె కేంద్రాలు నడుపుతున్నారు. దీంతో టీచర్లు, చిన్నారులకు అవస్థలు తప్పడం లేదు. దీనికి తోడు అంగన్వాడీ కేంద్రాల అద్దె బిల్లులు సకాలంలో రాకపోవడంతో టీచర్లు, సిబ్బంది పడరాని పాట్లు పడుతున్నారు.
ఖమ్మం జిల్లాలో ఏడు అంగన్వాడీ ప్రాజెక్టుల కింద 1,840 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 958 సొంత భవనాలు, 448 అద్దె భవనాలు, 434 ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నాయి. అయితే 448 కేంద్రాలను గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో అద్దెకు తీసుకుని కేంద్రాలు నడిపిస్తున్నారు. మరో 434 కేంద్రాలను ప్రైమరీ పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాల వంటి ప్రభుత్వ భవనాల్లో కొనసాగిస్తున్నారు.
ఏడు నెలలుగా
జిల్లాలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు ఆగస్టు నుంచి అద్దె బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. బిల్లులు రాకపోవడంతో అంగన్వాడీ టీచర్లు ఇంటి యజమానులకు సమాధానం చెప్పలేక ఇబ్బందులకు గురవుతున్నారు. కొందరు టీచర్లు చేసేది ఏమీలేక సొంత డబ్బులు చెల్లిస్తూ కేంద్రాలను నెట్టుకొస్తున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అద్దె చెల్లింపులకు పారిశుధ్యం, నీటి సదుపాయం, 500 గజాల స్థలం కలిగి ఉండాలి. రెండు గదులతోపాటు కిచెన్ రూమ్ వేరుగా ఉండాలి. నిబంధనల మేరకు ప్రభుత్వం ఇచ్చే అద్దె అరకొరగా ఉండడంతో ఇళ్లు లభించక అంగన్వాడీ టీచర్లు అరకొర వసతుల మధ్యే భవనాలను కొనసాగిస్తున్నారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలు, ప్రాథమిక పాఠశాలల్లో సైతం అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తూ నెట్టుకొస్తున్నారు. నెలవారీగా కేంద్రాలకు చేరే బియ్యం, గుడ్లు, పౌష్టికాహారం, ఆట వస్తువులు దాచేందుకు కూడా కష్టతరంగా మారింది. పట్టణ ప్రాంతాల్లో అంగన్వాడీలకు రూ.1,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ.750 చొప్పున అద్దె చెల్లిస్తుండడంతో ఆ అద్దెకు ఇళ్లు దొరక్క తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.