– ఖమ్మం మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత, సీడీపీఓ కమలప్రియ
ఖమ్మం రూరల్, మే 30 : ప్రైవేట్ కాన్వెంట్లకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని ఏదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత, ఐసిడిఎస్ ఖమ్మం రూరల్ ప్రాజెక్టు అధికారి కమల ప్రియ తెలిపారు. శనివారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో జలగం నగర్ సెక్టార్ పరిధిలోని 23వ వార్డు ఇందిరమ్మ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడీ బాట అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్, సిడిపిఓ తొలుత ఆరు సంవత్సరాలు నిండిన అంగన్వాడీ విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం చిన్నారుల తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులలో సమాజంలో ప్రైవేట్ విద్యా సంస్థలలో అధిక ఫీజులు చెల్లించాల్సి వస్తుందన్నారు.
ప్రీ స్కూల్ పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపినట్లయితే నాణ్యమైన విద్యతో పాటు సంపూర్ణ ఆరోగ్యానికి కావలసిన పోషకాహారం అందించడం జరుగుతుందన్నారు. ప్రీస్కూల్ పిల్లలకు ఆంగ్ల బోధన, ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గర్భిణీలు, బాలింతలు సైతం నిత్యం అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి స్త్రీ సంక్షేమ శాఖ ద్వారా అమలవుతున్న పథకాలను, సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మూడు నుండి ఆరు సంవత్సరాల వయస్సు గల పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని వారు కోరారు. అనంతరం కాలనీలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ పుష్పలత, అంగన్వాడీ లెవల్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, పిల్లల తల్లులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.