వరి పంటకు ప్రత్యామ్నయంగా కూరగాయల సాగు చేపట్టి రూ.లక్షల్లో ఆదాయం పొందుతూ చుట్టుపక్కల రైతులకు ఆదర్శంగా నిలిచాడో రైతుబిడ్డ. దుమ్ముగూడెం మండల కేంద్రానికి అతిసమీపాన ఉన్న కన్నాపురం గ్రామానికి చెందిన అయ్యపురెడ్డి శ్రీధర్ తనకున్న 23 ఎకరాల్లో పలురకాల కూరగాయలు సాగు చేస్తున్నాడు. అప్పుడప్పుడూ పంట మార్పిడి కోసం అపరాలైన మినుము, పెసర సాగు చేస్తూ ఆ ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం గడించాలనే ఆలోచనతోనే ప్రతి ఏటా పలు రకాల కూరగాయలు, బంతిపూల తోట సాగు చేస్తూ నెలకు రూ.లక్షపైనే సంపాదిస్తున్నట్లు చెబుతున్నాడు శ్రీధర్.
– దుమ్ముగూడెం, ఫిబ్రవరి 14
రెండేళ్ల క్రితం సీఎం కేసీఆర్ రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసి ఆర్థికంగా బలపడాలని చెప్పిన మాటను గుర్తు పెట్టుకున్న రైతు అయ్యపురెడ్డి శ్రీధర్. సీఎం మాటను అక్షరాల పాటించి వరికి బదులుగా కూరగాయల సాగుపై దృష్టి మళ్లించి ఆ దిశగా అడుగులు వేసి సక్సెస్ సాధించాడు. అనుకున్నదే తడువుగా వివిధ రకాల కూరగాయల సాగుతోపాటు బంతిపూల సాగు చేపట్టాడు. చివరకు విజయం సాధించి గత రెండేళ్లుగా నెలకు రూ.లక్షకు పైగానే ఆదాయం గడిస్తున్నాడు. దుమ్ముగూడెం మండలం కన్నాపురం గ్రామానికి చెందిన శ్రీధర్ ఆ చుట్టుపక్కల రైతులకు రోల్మోడల్గా నిలిచాడు.
కూరగాయల పంటలు..
తనకున్న 23 ఎకరాల విస్తీర్ణంలో ఎకరంలో బీరకాయ, నాలుగు ఎకరాల్లో వంగ, ఆరెకరాల్లో టమాటా, కాకర ఎకరం, బెండ రెండెకరాలు, దొండ మూడెకరాలు, ఆరెకరాల్లో ఇతర పంటలను సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం వంగ పూత, కాత మీద ఉంది. బంతిపూల సాగు, కాకర గత సీజన్తో ముగిసింది.
ఆదాయం నెలకు రూ.లక్షపైనేమ
గత రెండేళ్ల క్రితం శ్రీధర్ కూరగాయల సాగు చేపట్టాడు. మొదట్లో డ్రిప్ సౌకర్యం ఏర్పాటు కోసం రూ.5 లక్షలు, దొండ, కాకర, బీర పందిళ్ల కోసం రూ.5.50 లక్షలు పెట్టుబడి పెట్టాడు. నాటినుంచి నెలకు రూ.లక్షకు పైగానే ఆదాయం వస్తున్నదని చెబుతున్నాడు. సాగుచేసిన కూరగాయల పంటల్లో టమాటా డైలీ స్పేకింగ్ 100 ట్రేలు వస్తాయి. ఒక్కో ట్రే 25 కిలోలు ఉంటుంది. మార్కెట్ ధర ప్రకారం రూ.150కు విక్రయిస్తున్నాడు. బెండ ప్రతిరోజూ 150 నుంచి 200 కిలోలు దిగుబడి వస్తున్నది. మార్కెట్ ధర ప్రకారం కిలో రూ.30 విక్రయిస్తున్నాడు. ఇలా ప్రతి పంటకు కలిసి ఆదాయం నెలకు రూ.లక్షకు పైగానే ఉంటుంది. గత సీజన్లో వచ్చిన ఆదాయంతో పోల్చుకుంటే ఈ సీజన్ లాభదాయకంగా ఉంది. వచ్చే వేసవికాలంలో నీటితడులను బట్టి 7 నుంచి 8 ఎకరాల్లో మాత్రమే కూరగాయల సాగును చేపడతారు. తన తోటలో పండించిన కూరగాయలను ఇంటి ముంగిట ఉంచి మార్కెట్ ధరకు విక్రయిస్తుంటారు. అంతేకాకుండా కూరగాయలను భద్రాచలం, చర్ల తదితర గ్రామాలకు చెందిన పలువురు వ్యాపారులు తోటకు వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు.
అంతర పంటగా అపరాల సాగు…
పంట మార్పిడి కోసం అంతర పంటలుగా అపరాలను సాగు చేస్తున్నాడు. అంతర పంటలైన మినుము, పెసరను సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ సమయంలో సాగు చేస్తాడు. భూమి సారవంతంగా మారడంతోపాటు కూరగాయల పంటకు అనుకూలంగా ఉండేలా ఈ సాగును చేపడుతున్నాడు. పండుగ సీజన్లో బంతిపూల సాగు సైతం చేపడుతుంటాడు. దీపావళి, సంక్రాంతి, కార్తీకమాసం సమయాల్లో బంతిపూలకు డిమాండ్ ఉండడంతో ఆ పంటను సాగుచేస్తున్నాడు.
కూరగాయల సాగులోనే లాభాలు అధికం
ఇతర పంటల కంటే కూరగాయల సాగులోనే ఆదాయం అధికంగా ఉంటుంది. నేను నా 23 ఎకరాల్లో కూరగాయల సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నాను. రెండేళ్ల క్రితం నుంచి నెలకు రూ.లక్షకుపైగానే ఆదాయం వస్తున్నది. మొదట్లో డ్రిప్ కోసం రూ.5 లక్షలు, బీర, కాకర, దొండ పందిళ్ల కోసం రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టా. ఆ తర్వాత పెద్దగా పెట్టుబడి ఏమీలేదు. చాలామంది రైతులు వచ్చి నా వ్యవసాయ క్షేత్రాన్ని చూసి వెళ్తున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలవడం గర్వంగా ఉంది. – అయ్యపురెడ్డి శ్రీధర్, రైతు, కన్నాపురం