ఎడ్యుకేషన్, జనవరి 22 : ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఏయే కోర్సులు చదవాలి.. ఎటువైపు వెళితే జీవితంలో త్వరితగతిన స్థిరపడవచ్చు.. మంచి ఉద్యోగం చేయవచ్చు అనే అంశంపై ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, కేఎల్ యూనివర్సిటీ’ సంయుక్తంగా ‘లక్ష్యం-2024’ పేరుతో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం సమీపంలోని లక్ష్మీదేవిపల్లిలో గల కృష్ణవేణి జూనియర్ కళాశాలలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సదస్సు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. దీనికి ముఖ్యఅతిథిగా కేఎల్ యూనివర్సిటీ అధికారులు, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే బాధ్యులు హాజరై దిశానిర్దేశం చేయనున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థినీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సదస్సుల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.